దుమ్ము , ధూళి, కాలుష్యం చేరినప్పుడు ముక్కు నుంచి గుండె వరకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. పైగా మనదేశంలో ఎక్కువ కాలుష్యం కలిగిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. కాబట్టి మరింత జాగ్రత్త అవసరం అంటున్నారు డాక్టర్లు. వేసవిలో ఎండ తీవ్రత, వేడిగాలి కారణంగా గాలి నుంచి సోకే బ్యాక్టీరియా మరింత వేగంగా ఒంట్లోకి ప్రవేశిస్తుంది. శరీరంలో ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్.. పీల్చుకునే గాలి నుంచే లభిస్తుంది. ఇది ముందుగా ఊపిరితిత్తుల్లోకి.. అక్కడ్నుంచి రక్తంలోకి చేరుకొని.. హిమోగ్లోబిన్తో జతకట్టి అన్నికణాలకు చేరుతుంది. అందుకే గాలిలో తీవ్రమైన
ధూళి కణాల ఎఫెక్ట్
గాలిలో ఉండే దుమ్ము.. కలుషిత రసాయనాలతో వెంటనే కలిసిపోతుంది. సిటీలో కాలుష్య౦ వల్ల ఏర్పడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్, కార్బాక్సీలిక్ యాసిడ్ లాంటివి గాలిలోని దుమ్ము, ధూళితో కలిసిపోయి చిన్న చిన్న కణాల్లా ఏర్పడతాయి. ఈ ధూళి కణాలు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. పది మైక్రాన్ల కంటే ఎక్కువ సైజు ఉండే కణాలు కింద పడిపోతాయి. కానీ రెండు నుంచి పది మైక్రాన్లలోపు ఉండేవి మాత్రం గాల్లో అలా తేలియాడుతూ ఉంటాయి. ఇవి మనం శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు, శ్వాసనాళం గుండా ప్రయాణించి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి పలు సమస్యలకు దారితీస్తాయి.
సమస్యలు ఇవే..
ఎండాకాలం గాలి ప్రభావం వల్ల కళ్ల మంటలు, దురద, నీరు రావటం వంటివి తలెత్తొచ్చు. వేడి గాలిలోని దుమ్ము , ధూళి ముక్కులో ప్రవేశించినప్పుడు ముక్కులో అలర్జీ పుడుతుంది. దాని వల్ల మంట, నీరు కారటం, దురద వంటివి మొదలవుతాయి. కొంతమందిలో సైనసైటిస్ ప్రాబ్లమ్ కూడా రావొచ్చు.
ఇక ఇంకో ముఖ్యమైన సమస్య ఆస్తమా. దుమ్ము, వాహనాల నుంచి వెలువడే రసాయనాలు శ్వాస ద్వారా లోపలికి వెళ్లినప్పుడు, శ్వాసనాళాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం కుచించుకుపోతుంది. ఇది ఆస్తమాకు దారితీస్తుంది. దీనివల్ల దగ్గు, ఛాతిలో బరువుగా ఉండటం వంటి లక్షణాలు వేధిస్తాయి. ఇక ఆస్తమా ఉన్న పేషెంట్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎండాకాలం మరింత సమస్యగా మారుతుంది.
సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్)
గుండె మన శరీరానికి శక్తి కోసం ఆక్సిజన్ను వినియోగించుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని ఫ్రీరాడికల్స్ విడుదలవుతుంటాయి. వీటిని యాంటీ ఆక్సిడెంట్లు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయటమో, ఒంట్లోంచి బయటకు పంపించడమో చేస్తుంటాయి. అయితే కొందరిలో ఈ ప్రక్రియ దెబ్బతిని వాపుకు దారి తీస్తుంది. దీంతో సీఓపీడీ వంటి సమస్యలతో పాటు గుండెజబ్బులు, పక్షవాతం వంటి జబ్బులు కూడా తలెత్తవచ్చు.
పిల్లలపై కూడా..
చిన్నపిల్లల్లో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందవు. వీరిలో రోగనిరోధకశక్తి కూడా తక్కువే. అందువల్ల పెద్దల కన్నా పిల్లలపై ఇలాంటి ఇన్ఫెక్షన్లు మరింత ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే సిటీల్లోని పిల్లల్లో 20 శాతం ఎక్కువ మంది ఆస్తమాతో బాధపడుతున్నారని కొన్ని సర్వేల్లో తేలింది.
గుండెకు కూడా..
కలుషితమైన గాలిని పీల్చినప్పుడు ఆక్సిజన్ కన్నా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువమొత్తంలో శరీరంలోకి వెళ్తుంది. ఇది హిమోగ్లోబిన్తో జతకూడి కార్బాక్సీహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. దీంతో గుండెకు రక్తసరఫరా తగ్గిపోయి గుండెపోటు రావొచ్చు. వాయు కాలుష్యంతో తెల్లరక్తకణాల సంఖ్య కూడా మారిపోతున్నట్టు, ఇది గుండె రక్తనాళాల పనితీరును మార్చేస్తున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. మెదడుకు రక్తసరఫరా చేసే నాళాల్లో ఇలాంటి పరిస్థితే ఏర్పడితే పక్షవాతం రావొచ్చు.