నేర చరిత్ర ఉన్న నేతలకు సుప్రీం షాక్

నేర చరిత్ర ఉన్న నేతలకు సుప్రీం షాక్

నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తోంది సుప్రీం కోర్టు. ప్రతి రాజకీయ పార్టీ వారి అధికారక వెబ్ సైట్లతో పాటు, సోషల్ మీడియాలో నేర చరిత్ర కలిగిన నాయకుల పూర్తి వివరాలను అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, నేర చరిత్ర కలిగిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పించారో కూడా తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థికి టికెట్ ఇచ్చిన 48 గంటలల్లోగానే ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని… న్యూస్ పేపర్లలో కూడా ప్రచురించాలని ఆదేశించింది. 72 గంటల్లో అభ్యర్థి క్రిమినల్ కేసుల వివరాలను ఎలక్షన్ కమిషన్ కు అందించాలని చెప్పింది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర ఓటర్లకు తెలవాలని… వారికి ఓటు వేయాలో… వద్దో ఓటర్లే నిర్ణయించుకుంటారని చెప్పింది. సీరియస్ క్రైమ్స్ లో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడానికి, పార్టీలలో కీలక బాధ్యతలను చేపట్టకుండా చూసేందుకు చట్టాలను మార్చాలంటూ 2018 సెప్టెంబర్ లో ఐదుగురు సభ్యులతో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే సుప్రీంకోర్టు సూచనలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోలేదంటూ బీజేపీ నేత, లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.