
ఫాం హౌస్ కేసులో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు చెప్పారు. కేసుకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్పులను పంపినందుకు న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియోలను సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు పంపారు. ఇవాళ కేసు విచారణ సందర్భంగా దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆడియో, వీడియోలను న్యాయమూర్తులకు ఎలా పంపుతారని జస్టిస్ గవాయ్, జస్టిస్ అరవింద్తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్ నుంచి సీబీఐకు బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17న విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరడంతో కేసును ఇవాళ్టికి వాయిదా వేసింది. తాజాగా కేసు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సీఎం కేసీఆర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది.