కేటీఆర్​కు సుప్రీం నోటీసులు..రూ.25 వేల కోట్లు దారిమళ్లించారని కామెంట్స్

కేటీఆర్​కు సుప్రీం నోటీసులు..రూ.25 వేల కోట్లు దారిమళ్లించారని కామెంట్స్
  • మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ అవినీతి ఆరోపణలు
  • కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీంలో ఆత్రం సుగుణ పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు: మూసీ ప్రక్షాళనపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.25 వేల కోట్లను రేవంత్ సర్కార్ దారి మళ్లించిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆ పార్టీ నేత ఆత్రం సుగుణ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్​లో గతేడాది సెప్టెంబర్ 30న కేటీఆర్ పై ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

ఈ వ్యవహారంలో తనపై అక్రమ కేసును బనాయించారని, ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ ఎఫ్ ఐఆర్ ను కొట్టివేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 21న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ  ఆత్రం సుగుణ మే 19న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన డివిజన్​ బెంచ్  శుక్రవారం విచారించింది. ఆత్రం సుగుణ పిటిషన్​కు సమాధానం ఇవ్వాలని ప్రతివాదులుగా ఉన్న కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.