సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ -విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. . ఈ క్రమంలో ఏపీకి వెళ్తున్న వాహనదారులకు సూర్యపేట ఎస్పీ నరసింహ విన్నూతంగా పండగ విషెస్ చెప్పారు. ప్రయాణికులను ఆపి గులాబీ పువ్వు ఇచ్చి పండగ శుభాకాంక్షలు చెప్పారు. రోడ్ సేఫ్టీ పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. అనంతరం సూర్యాపేట ఎఫ్ సి ఐ గోడౌన్ దగ్గర ఎన్ హెచ్ 65 పై వాహనాల రద్దీని పరిశీలించారు ఎస్పీ. డ్రోన్ కెమెరా ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షించారు ఎస్పీ.
సాధారణంగా రోజుకు ఈ హైవేపై 25 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సంక్రాంతి టైమ్లో ఆ సంఖ్య 60 వేల నుంచి లక్ష వాహనాలకు పైగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్లు, రోడ్ సేఫ్టీ, స్పీడ్ బ్రేకర్లు, 24/7 రహదారి పర్యవేక్షణ, పోలీస్ పికెట్లు సెటప్ చేస్తున్నారు. ఈ సారి ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
డ్రోన్ల హెల్ప్తో ఎప్పటికప్పుడు సమాచారం
హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ జామ్ అయినా.. కమాండ్ కంట్రోల్ కి సమాచారం అందేలా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ప్రజలు సేఫ్గా గమ్య స్థానాలు చేరేలా భద్రతా చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మీదుగా వెళ్లే ఎన్ హెచ్ 65 రహదారిపై 24 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో పోలీస్ సిబ్బంది, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలతో పాటు డ్రోన్లను రంగంలోకి దించారు.
పండుగకు 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రస్తుతం గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ వైపు వెళ్లే వాహనాలు నార్కెట్పల్లి మీదుగా, రాజమండ్రి, వైజాగ్ వైపు వెళ్లే వాహనాలు నకిరేకల్, టేకుమట్ల వద్ద దారి మళ్లిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ సిబ్బందితో పోలీస్ పికెట్లు, పోలీస్ పెట్రోలింగ్, క్రేన్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు పర్యవేక్షించేలా డ్రోన్లు ఏర్పాట్లు చేశారు.. దీంతో ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాలకు వెంటనే పోలీస్ సిబ్బంది చేరుకుని క్లియర్ చేస్తున్నారు.
