- షరతులతో అంగీకరించిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ వీడింది. రేపు మంగళవారం మంత్రివర్గం నిర్వహణకు సీఈసీ షరతులతో కూడిన అనుమతిచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను పరిశీలించిన సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. స్క్రీనింగ్ కమిటీ అమోదించిన అజెండా నోట్ను ఈనెల 10 తేదీ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా సీఈసీకి పంపారు. ప్రతిపాదిత అజెండా తో పాటు క్యాబినెట్ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం తరపున విజ్ఞప్తిని పంపారు.
క్యాబినెట్ నిర్వహించుకోవచ్చని ఈసీ అనుమతి ఇవ్వడంతో రేపు ఉదయం ముఖ్యశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు.
మంచినీరు, సాగునీరు, Fani తుఫాను, కరువు అంశాలపై కేబినెట్ భేటీలో సీఎం బాబు చర్చించనున్నారు. అయితే కొత్త నిర్ణయాలకు, రేట్ల మార్పుకు, బకాయిల చెల్లింపులకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఈసీ అనుమతి తర్వాత అమలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా కేబినెట్ నిర్ణయాలపై ఎలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.