పవన్ కల్యాణ్ అడ్వైజర్ గా తమిళనాడు మాజీ సీఎస్

పవన్ కల్యాణ్ అడ్వైజర్ గా తమిళనాడు మాజీ సీఎస్

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పొలిటికల్ అడ్వైజర్ గా, తమిళ నాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ పి.రామ్మోహ‌న్ రావు నియమితులయ్యారు. సోమవారం ఉదయం విజయవాడలోని పార్టీ ఆఫీస్ లో రామ్మోహన్ రావుకు పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్నాడీఎంకే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు … జయలలిత హాస్పిటల్ లో ఉన్న టైమ్ లో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించారని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు అయ్యేలా చూశారని చెప్పారు. అలాంటి గొప్పవ్యక్తులు పార్టీపైన, తనపైనా నమ్మకం ఉంచి రావడం సంతోషకరమనీ.. జనసేన బలోపేతం అవుతోందనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం.. ఆయనకు రాజకీయ సలహాదారుడిగా పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు రామ్మోహన్ రావు. ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉందనీ.. రాష్ట్రాన్ని రక్షించడానికి కొత్త నాయకుడు రావాల్సి ఉందని చెప్పారు. ప్రజాక్షేమంపై పవన్ కల్యాణ్ లో అత్యున్నత ఆశయాలు ఉన్నాయన్నారు. సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ గా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా… ప్రజా జీవితాన్ని ఎంచుకోవడం గొప్ప విషయం అని చెప్పారు. పవన్ కల్యాణ్ ను సీఎం చేయడానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.