
రోజుకు 2 జీబీ డాటా ఫ్రీగా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కాలేజీల్లో చదువుతున్న 9.69 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. విద్యార్థుల కోసం ఉచిత డాటా కార్డు ఇస్తామని సీఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. దాంతో వారందరూ ఆన్లైన్ క్లాసులు వినొచ్చని ఆయన అన్నారు.
‘కరోనా కారణంగా దాదాపు తొమ్మిది నెలల నుంచి కాలేజీలు మూతపడ్డాయి. దాంతో విద్యార్థుల కోసం కాలేజీలు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినే సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. రోజుకు 2 జీబీ చొప్పున జనవరి నుంచి ఏప్రిల్ వరకు డాటా అందిస్తాం. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుతున్న 9,69,047 మంది విద్యార్థులకు ఉచిత డేటా కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని సీఎం పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డేటా కార్డులన్నీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ (ELCOT) ద్వారా సరఫరా చేయబడతాయి.
విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఉచిత ల్యాప్టాప్లను అందిస్తోంది. అయితే ఇంటర్నెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో చాలామంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినడంలేదు. దాంతో విద్యార్థులకు ఉచిత డేటాను అందించాలని విద్యార్థి సంఘాలు కోరిన నేపథ్యంలో.. సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.