- 45 ఫారెస్ట్ బ్లాక్లు, పార్కుల అభివృద్ధికి సన్నాహాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షా కాలం ప్రారంభం కావడంతో కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం రెడీ అవుతోంది. ఈ ఏడాది 45 ఫారెస్ట్ బ్లాక్ లను అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ హెచ్ఎండీఏను సంప్రదించింది.
భారీగా మొక్కలు నాటడంతో పాటు, గ్రీనరీ పెంపునకు చర్యలు తీసుకోనుంది. అలాగే, హెచ్ఎండీఏ పరిధిలోని మెయిన్చౌరస్తాల్లో ఉన్న సెంట్రల్ మీడియన్లను కూడా డెవలప్చేయనున్నారు. వాటితోపాటు రోడ్లకు రెండువైపులా అవెన్యూ ప్లాంటేషన్, కాలనీ పార్క్ ల అభివృద్ధి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లేక్ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టనున్నారు.
గతేడాది వన మహోత్సవంలో 3.3 కోట్ల మొక్కలు నాటామని, ఈసారి రూ.300 కోట్లతో 4.5 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అర్బన్ఫారెస్ట్రీ డైరెక్టర్ప్రసాద్తెలిపారు. ఇందులో అధికారులతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, కాలనీ సంఘాలను భాగస్వామ్యం చేయనున్నట్లు పేర్కొన్నారు.
హెచ్ఎండీఏ లేఔట్లలోనూ ప్లాంటేషన్, గ్రీనరీని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రేటర్లో పదేండ్లు దాటిన పార్కులను, 200కు పైగా ప్రభుత్వ, కాలనీ పార్కులను డెవలప్చేయనున్నట్లు చెప్పారు. కాలనీ పార్కుల అభివృద్ధి కోసం ఆయా సంఘాల వారు అధికారులను సంప్రదిస్తే అవసరమైన మొక్కలు సరఫరా చేస్తారని తెలిపారు.
