దేశంలో ట్యాక్స్​ టెర్రరిజం: మంత్రి సీతక్క

దేశంలో ట్యాక్స్​ టెర్రరిజం: మంత్రి  సీతక్క

కొత్తగూడ,వెలుగు: ప్రస్తుతం బీజేపీ పాలనలో పన్నుల మోతతో  దేశంలో ట్యాక్స్​ టెర్రరిజం నడుస్తోందని పంచాయతీ రాజ్​శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లిలో కొత్తగూడ, గంగారం మండలాలకు సంబంధించి పార్లమెంట్​ఎన్నికల సన్నాహక సభ జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తినే తిండితో పాటు పుడితే పన్ను..చస్తే పన్ను వేస్తోందని, ఆ పన్నులను చూసి జనాలు భయపడుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల్లోని ప్రజాప్రతినిధులను, లీడర్లను అవినీతి పేరుతో బెదిరించి భయపెట్టి బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్​తో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని కోడ్ ముగియగానే హామీలన్ని అమలు చేస్తామన్నారు. 

అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూనే ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే దిశగా మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఇలాంటి వాటికి చెక్​ పెట్టేందుకు ఈ సారి కాంగ్రెస్​ను​ గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్​ మాట్లాడుతూ తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందని, బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఇన్​చార్జి అనిల్​కుమార్, ములుగు జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు పైడాకుల అశోక్​,స్టేట్​ఆర్గనైజింగ్​సెక్రెటరీ చల్లా నారాయణ రెడ్డి, కొత్తగూడ,గంగారం మండలాల అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకన్న, బ్లాక్​ కాంగ్రెస్​అధ్యక్షుడు మొగిలి, ఎంపీపీలు విజయారూప్​సింగ్, సరోజన, జడ్పీటీసీలు పుష్పలత, రమ పాల్గొన్నారు.