ప్రాణాలు తీస్తున్న టీబీ

ప్రాణాలు తీస్తున్న టీబీ

రాష్ట్రంలో ఏటా సగటున 70 వేల కేసులు నమోదు
దేశంలో ఏటా 2.24 లక్షల పీడియాట్రిక్‌‌‌‌ టీబీ కేసులు
రాష్ట్రంలో రిపోర్ట్ అవుతున్న కేసుల్లో 6 శాతం పిల్లలవే

హైదరాబాద్, వెలుగు:క్షయ వ్యాధి(టీబీ) కంట్రోల్​ కావట్లేదు. పెద్దలతో పాటు పిల్లల ప్రాణాలనూ తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టీబీతో మరణించే పిల్లల సంఖ్య లక్షల్లో ఉంటోంది. 2017లో 2,50,000 మంది చిన్నారులు టీబీతో చనిపోయినట్టు ఇటీవల కేంద్రం విడుదల చేసిన టీబీ రిపోర్ట్‌‌‌‌ వెల్లడించింది. మన దేశం విషయానికి వస్తే ఏటా సగటున 20 లక్షల మంది టీబీ బారిన పడుతుంటే, ఇందులో 2.24 లక్షల మంది పిల్లలే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మరణాలకు గల టాప్‌‌‌‌10 కారణాల్లో టీబీ కూడా ఒకటి. వాస్తవానికి టీబీ రాకుండా, పుట్టిన 24 గంటలలోపే పిల్లలకు బీసీజీ టీకా ఇస్తారు. ఇది 12 నుంచి 15 ఏండ్ల వరకూ టీబీ రాకుండా రక్షణ ఇస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే 15 ఏండ్ల లోపలే లక్షలాది మంది పిల్లలు ఇప్పుడు టీబీ బారిన పడుతున్నారు.

మన రాష్ట్రంలోనూ..

రాష్ట్రంలో ఏటా సగటున 70 వేల మంది టీబీ బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికి 54 వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో 5 నుంచి 6% పీడియాట్రిక్ కేసులే ఉన్నట్టు టీబీ కంట్రోల్ యూనిట్ అధికారులు తెలిపారు. పుట్టినప్పుడు ఇచ్చే బీసీజీ టీకా ప్రభావం 12 ఏండ్ల వరకూ పిల్లలకు ఇమ్యునిటీ ఇస్తుంది. ఆ తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది. ఈ ఏజ్‌‌‌‌లో పిల్లలకు ఇమ్యునిటీ తక్కువగా ఉండటంతో టీబీ ఉన్న వాళ్లకు దగ్గరగా మెలిగితే వారికీ సోకే ప్రమాదం ఉంది. పీడియాట్రిక్‌‌‌‌ టీబీలో ఎక్కువగా ఇలాంటి కేసులే ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పోషకాహార లోపం, జంక్ ఫుడ్‌‌‌‌తో పిల్లల్లో ఇమ్యునిటీ తగ్గడం వల్ల కూడా టీబీ వంటి అంటువ్యాధులు పిల్లలకు తొందరగా సోకుతున్నాయంటున్నారు.

ఇమ్యునిటీ ఇచ్చే ఫుడ్‌‌‌‌ పెట్టాలె

ఇండియాలో నమోదవుతున్న టీబీ కేసుల్లో 7% నుంచి 10% పీడియాట్రిక్‌‌‌‌ టీబీవే. రాష్ట్రంలో ఇది 5 నుంచి 6% ఉంటోంది. పిల్లలకు పోషకాహారం ఇవ్వడం ద్వారా టీబీ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించవచ్చు.                                                                                        ‑ డాక్టర్‌‌‌‌‌‌‌‌ రాజేశం, జాయింట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, స్టేట్ టీబీ కంట్రోల్ యూనిట్