మైనార్టీ రెసిడెన్షియల్​ స్కూల్​లో .. స్టూడెంట్‌ను కొట్టిన టీచర్​

మైనార్టీ రెసిడెన్షియల్​ స్కూల్​లో .. స్టూడెంట్‌ను కొట్టిన టీచర్​
  • ఫ్రెండ్​కు ఎరేజర్​ ఇచ్చినందుకే కొట్టాడంటున్న విద్యార్థి
  • స్టడీ అవర్​లో పరిగెత్తడం, తిట్టడంతో భయపెట్టాలని చూశానన్న టీచర్​
  • ఆర్ట్​ టీచర్‌‌కు మెమో  

కోరుట్ల, వెలుగు : కోరుట్లలోని ప్రభుత్వ మైనార్టీ బాయ్స్‌ రెసిడెన్షియల్ ​స్కూల్‌లో ఓ స్టూడెంట్​ను ఆర్ట్​ టీచర్​ ఇష్టమున్నట్టు చితకబాదాడు. ఎరేజర్‌‌ను తోటి విద్యార్థికి ఇచ్చినందుకు తన వీపుపై, కడుపులో గుద్దాడని, పారిపోతుండగా కాళ్లు పట్టి గుంజాడని బాధిత స్టూడెంట్ ఆరోపించాడు. అయితే, తాను భయపెట్టాలని మాత్రమే చూశానని, కొట్టలేదని, కాళ్లు పట్టి  గుంజానని టీచర్ ​చెబుతున్నాడు. ఈ ఘటనలో గాయపడిన స్టూడెంట్​ను కోరుట్ల దవాఖానకు, అక్కడి నుంచి జగిత్యాల దవాఖానకు తరలించారు. బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనం ప్రకారం... కోరుట్లలోని మెమిన్‌పురాకు చెందిన సిరాజ్‌ అలీ చిన్న కొడుకు ముదస్సిర్​ బన్న పట్టణ శివారులోని మైనార్టీ బాయ్స్ ​రెసిడెన్సియల్​స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి స్టడీ అవర్​లో అతడు తోటి స్టూడెంట్​అడిగాడని తన వద్ద ఉన్న ఎరేజర్‌‌ ఇచ్చాడు.

దీంతో చదవకుండా టైం వేస్ట్​ చేస్తున్నాడని ఆగ్రహించిన ఆర్ట్​ టీచర్ ​చంద్రశేఖర్ స్టూడెంట్​ను ​కొట్టాడు. వీపుపై, కడుపులో గుద్దాడు. కిందపడిపోగా కాలు పట్టి గుంజడంతో మోకాలి కింద బొక్క ఉబ్బింది. ఇది చూసిన  అక్కడి స్టాఫ్​ పిల్లాడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పేరెంట్స్​కు  సమాచారమిచ్చారు. డాక్టర్ల సలహా మేరకు జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు. టీచర్‌‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి సిరాజ్‌ అలీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ​హరీశ్‌కు ఫిర్యాదు చేశాడు. టీచర్ ​చంద్రశేఖర్​ను వివరణ కోరగా..స్టడీ అవర్​లో మదస్సిర్ ​రూమ్ లో కూర్చోకుండా తిరిగాడని, ప్రశ్నిస్తే తననే తిట్టాడన్నారు.

దీంతో అతడికి భయం ఉండాలని కొట్టబోతే పరిగెత్తాడన్నారు. కాళ్లు పట్టి లాగానని, కొట్టలేదన్నారు. అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో ఆక్సిజన్​ పెట్టించి గవర్నమెంట్ హాస్పిటల్​కు తీసుకువెళ్లామన్నారు. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదని తెలిసిందని, అందుకే పడిపోయాడన్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ టీచర్‌‌కు మెమో ఇచ్చామని,  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.