
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో కంగారుల నడ్డి విరిచాడు. మొకాలి గాయంతో దాదాపు 5 నెలల పాటు క్రికెట్కు దూరమైన జడేజా..ఆసీస్తో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో 5 వికెట్లు తీసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. కీలక సమయంలో వికెట్లు తీసి..ఆసీస్ పతనంలో కీ రోల్ ప్లే చేశాడు. జడేజా వల్ల తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియా ఆలౌట్ కావడాన్ని జీర్ణించుకోలేని ఆ దేశ మీడియా..జడ్డూపై అక్కసు వెళ్లగక్కింది. జడేజా బౌలింగ్ పై సందేహం వ్యక్తం చేస్తూ న్యూస్ ఆర్టికల్స్ను రాసింది. మ్యాచ్ సమయంలో జడేజా తన చేతికి ఏమో రాసుకున్నాడని న్యూస్ ఆర్టికల్లో పేర్కొంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.
వీడియోలో ఏముంది..?
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 45 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 120 పరుగులు చేసింది. అప్పటికే జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. మరోసారి బౌలింగ్ వేసేందుకు వచ్చిన జడేజా 46వ ఓవర్ను వేశాడు. అయితే ఈ ఓవర్ వేయడానికి ముందు జడేజా బంతితో సిరాజ్ దగ్గరికి వెళ్లాడు. సిరాజ్ దగ్గర ఏదో పదార్థాన్ని తీసుకుని బంతిని స్పిన్ చేసే వేలికి రాసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఫీల్డింగ్ సెట్ గురించి మాట్లాడి బౌలింగ్ వేశాడు.
జడేజా ఏం రాసుకున్నాడు...?
జడేజా తన వేలిపై ఏం రాసుకున్నాడనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీన్ని భూతద్దంలో చూపిస్తూ ఆసీస్ మీడియా విషపు ప్రచారానికి పూనుకుంది. అటు ఆస్ట్రేలియా మీడియా వార్తలకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మద్దతు పలికేలా వ్యాఖ్యలు చేశాడు. జడేజా తన వేలికి ఏదో పూసుకున్నాడని...దాన్ని గతంలో చూడలేదంటూ ట్వీట్ చేశాడు. ఆసీస్ మాజీ క్రికెటర్ టిమ్ ఫైన్ కూడా ఈ వీడియో గురించి 'ఇంట్రెస్టింగ్' అంటూ కామెంట్ చేశాడు.
జడేజా రాసుకుంది ఏందంటే
జడేజా అంశంపై టీమిండియా మేనేజ్మెంట్ స్పందించింది. ఈ విషయం ముదరకముందే మ్యాచ్ రిఫరీకి విషయాన్ని వెల్లడించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దగ్గరికి వెళ్లి జడేజా తన వేలికి ఆయింట్మెంట్ రాసుకున్నాడని అని చెప్పింది. ఇది కేవలం నొప్పిని నివారించడానికే అని వివరణ ఇచ్చింది. అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియా టీమ్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ ఇలాంటి ఘటనలపై విమర్శలు వ్యక్తమైతే రిఫరీ స్వతంత్రంగా విచారణ చేసే అవకాశం ఉంది. బాల్ షేప్ మారకుండా నిబంధనల ప్రకారం ఆటగాళ్లు ఏదైనా రాసుకోవాలని అనుకున్నప్పుడు అంపైర్ అనుమతి తప్పనసరి. ఈ నేపథ్యంలో వివాదం పెద్దది కాకముందే స్పందించిన టీమిండియా మేనేజ్ మెంట్..రిఫరీకి విషయాన్ని వివరించింది.