
భాగ్యనగరంలో క్రికెట్ సందడి నెలకొంది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగే వన్డే సిరీస్లో భాగంగా ఫస్ట్ వన్డేకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వన్డేపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఉప్పల్లో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్లో ముందంజ వేయాలని టీమిండియా ఉత్సాహంతో ఉంది. ఈ తరుణంలో ఉప్పల్లో టీమిండియా వన్డే రికార్డు ఎలా ఉందో ఓ సారి గమనిద్దాం..
ఉప్పల్ లో ఎన్ని వన్డేలు ఆడిందంటే..?
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా తొలిసారిగా 2005లో తొలి వన్డే ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత 2007, 2009లలో ఆస్ట్రేలియాతో రెండు వన్డేలను ఆడింది. ఈ రెండింటిలోనూ టీమిండియా ఓడిపోయింది.
చివరి మూడింటిలో గెలుపు..
2011 తర్వాత భారత్ ఉప్పల్ స్టేడియంలో మూడు వన్డేలు ఆడింది. 2011లో ఇంగ్లండ్ పై గెలిచింది. 2014లో శ్రీలంకపై విజయం సాధించింది. చివరగా 2019లో ఆస్ట్రేలియాపై నెగ్గింది. ఆ తర్వాత భారత్ మళ్లీ ఇక్కడ వన్డే ఆడలేదు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న వన్డే కావడంతో..ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.