నవరత్నం..తొమ్మిదోసారి శాఫ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా ఇండియా

నవరత్నం..తొమ్మిదోసారి శాఫ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా ఇండియా

బెంగళూరు:  లెజెండరీ ప్లేయర్​ సునీల్‌‌‌‌ ఛెత్రి కెప్టెన్సీలో ఇండియా ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ టీమ్‌‌‌‌ మరో కప్పు సొంతం చేసుకుంది.  గత నెల భువనేశ్వర్‌‌‌‌లో ఇంటర్‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌ కప్‌‌‌‌ నెగ్గిన టీమిండియా ఇప్పుడు బెంగళూరు గడ్డపై  సౌత్‌‌‌‌ ఏషియన్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ ఫెడరేషన్ (శాఫ్‌‌‌‌) చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. శాఫ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఏకంగా తొమ్మిదోసారి విజేతగా నిలిచి ఈ టోర్నీలో తమకు తిరుగులేదని నిరూపించింది. మంగళవారం వేలాది ఫ్యాన్స్‌‌‌‌తో కిక్కిరిసిన కంఠీరవ స్టేడియంలో  హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇండియా పెనాల్టీ షూటౌట్‌‌‌‌లో 5–4తో కువైట్‌‌‌‌ను ఓడించింది. నిర్ణీత సమయం, ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌లో ఇరు జట్లూ 1–1తో సమంగా నిలిచాయి. కువైట్‌‌‌‌ తరఫున 14వ నిమిషంలో షాబిద్‌‌‌‌ అల్‌‌‌‌ ఖల్దీ గోల్‌‌‌‌ చేయగా.. ఇండియా నుంచి లాలియన్జువాలా చాంగ్టే 38 నిమిషంలో గోల్‌‌‌‌ కొట్టాడు. ఆపై, థ్రిల్లర్‌‌‌‌ సినిమాను తలపించిన పెనాల్టీ షూటౌట్‌‌‌‌లో గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ గుర్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ సూపర్‌‌‌‌ సేవ్‌‌‌‌తో  ఇండియా విజయఢంకా మోగించింది. 

నువ్వా నేనా..

తుదిపోరులో రెండు బలమైన జట్లు స్టార్టింగ్‌‌‌‌ నుంచే నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. టార్గెట్‌‌‌‌పై దాడులు చేస్తూ ముందుకెళ్లాయి. నాలుగో నిమిషంలో ఆకాశ్‌‌‌‌ ఇచ్చిన క్రాస్‌‌‌‌ను ఛెత్రి హెడర్‌‌‌‌తో పోస్ట్‌‌‌‌లోకి కొట్టే ప్రయత్నం చేయగా అది నేరుగా కువైట్‌‌‌‌ కీపర్‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. 9వ నిమిషంలో కువైట్‌‌‌‌కు తొలి కార్నర్‌‌‌‌ లభించగా.. ఇండియా డిఫెండర్లు దాన్ని క్లియర్‌‌‌‌ చేశారు. అయితే, 14వ నిమిషంలో రైట్‌‌‌‌ఫ్లాంక్‌‌‌‌లో  అల్‌‌‌‌బ్లౌషి నుంచి పాస్‌‌‌‌ అందుకున్న అల్‌‌‌‌ఖల్దీ.. ఇండియా కీపర్​ గుర్​ప్రీత్​ను బోల్తా కొట్టిస్తూ  గోల్‌‌‌‌ చేశాడు.  ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. తర్వాతి నిమిషంలోనే ఇండియా స్కోరు సమం చేయాల్సింది.  చాంగ్టే లాంగ్​ రేంజ్​ నుంచి కొట్టిన షాట్​ను కువైట్​ కీపర్​ అడ్డుకున్నాడు. ఈ దశలో ఇండియా మిడ్‌‌‌‌ఫీల్డర్లు తమ పొరపాట్లను సరిదిద్దుకొని దూకుడు పెంచారు. మంచి పాస్‌‌‌‌ లతో ప్రత్యర్థి డిఫెన్స్‌‌‌‌లోకి చొచ్చుకెళ్లారు. ఈ కమ్రంలో 38వ నిమిషంలో కురునియన్‌‌‌‌ బంతిని అందుకొని ఛెత్రికి పాస్‌‌‌‌ చేశాడు. ఛెత్రి వెంటనే సహల్‌‌‌‌కు పాస్‌‌‌‌ చేయగా.. అతని నుంచి క్రాస్‌‌‌‌ అందుకున్న ఛాంగ్టే  బాల్‌‌‌‌ను నెట్‌‌‌‌లోకి పంపించి స్కోరు 1–1తో సమం చేశాడు. సెకండాఫ్‌‌‌‌లో  ఇరు జట్లూ విన్నర్​ కోసం ట్రై చేశాయి. 88వ నిమిషంలో ఫ్రీకిక్‌‌‌‌కు అల్‌‌‌‌ ఖల్దీ కొట్టిన షాట్‌‌‌‌ను ఇండియా కీపర్‌‌‌‌ గుర్‌‌‌‌ప్రీత్‌‌‌‌ క్లియర్‌‌‌‌ చేశాడు. ఇంజ్యురీ టైమ్‌‌‌‌లోనూ అతను మరో సేవ్‌‌‌‌ చేయగా.. ఇండియా వెంటవెంటనే రెండు కౌంటర్‌‌‌‌ షాట్లు కొట్టినా గోల్‌‌‌‌ రాబట్టలేకపోయింది. ఆటగాళ్లకు గాయాలు, ఎల్లో కార్డులతో సాగిన ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌లోనూ ఇరు జట్లూ మరో గోల్‌‌‌‌ చేయకపోవడంతో ఫైనల్‌‌‌‌ షూటౌట్‌‌‌‌కు దారి తీసింది.

గెలిపించిన గుర్‌‌‌‌ప్రీత్‌‌‌‌

షూటౌట్‌‌‌‌లో ఫస్ట్ షాట్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌ సునీల్‌‌‌‌ ఛెత్రి గోల్‌‌‌‌ చేయగా.. కువైట్‌‌‌‌ తరఫున తొలి ప్రయత్నంలో అబ్దుల్లా దహమ్‌‌‌‌ షాట్‌‌‌‌ క్రాస్‌‌‌‌ బార్‌‌‌‌ను తగులుతూ బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఇండియా నుంచి సందేశ్‌‌‌‌, చాంగ్టే  స్కోరు చేయగా.. నాలుగో ప్రయత్నంలో ఉడాంత సింగ్‌‌‌‌ షాట్‌‌‌‌ బార్‌‌‌‌ పై నుంచి బయటకు వెళ్లింది. అటువైపు ఒటైబి, అల్‌‌‌‌ దెహరి, నజి చేసిన స్కోర్లతో కువైట్‌‌‌‌ 3–3తో స్కోరు సమం చేయడంతో ఉత్కంఠ పెరిగింది. ఆపై ఇండియా ఆటగాడు సుభాసిష్‌‌‌‌, కువైట్‌‌‌‌ నుంచి అల్‌‌‌‌ ఖల్దీ గోల్స్‌‌‌‌ కొట్టారు. దాంతో ఐదు ప్రయత్నాల్లో ఇరు జట్లూ 4–4తో సమంగా నిలవగా సడెన్‌‌‌‌ నిర్వహించారు. ఇందులో మహేశ్‌‌‌‌ గోల్‌‌‌‌ కొట్టగా.. కువైట్​ కెప్టెన్​  ఖాలెద్​ హజియా షాట్‌‌‌‌ను లెఫ్ట్​ సైడ్​ డైవ్‌‌‌‌ చేస్తూ సేవ్‌‌‌‌ చేసిన  గుర్‌‌‌‌ప్రీత్‌‌‌‌ ఇండియాను గెలిపించాడు.