
పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి వద్ద ఆదివారం హైడ్రామా నెలకొంది. లాలూ పెద్ద కొడుకు తేజ్ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్యర్యా రాయ్ మొదటిసారి అత్తింటి వేధింపులపై నోరువిప్పారు. తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆమె మహిళా హెల్ప్ లైన్కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకిదిగారు. తండ్రి చంద్రికా రాయ్తోకలిసి లాలూ ఇంటి వరండాలో ధర్నాకు దిగిన ఐశ్వర్య మీడియాతో మాట్లాడారు. ‘‘విడాకులపై కోర్టు తీర్పు వచ్చేదాకా భర్త(తేజ్ ప్రతాప్ యాదవ్)తోనే కలిసుండాలనుకున్నా. అత్త(రబ్రీదేవి), ఆడపడుచు(మీసా భారతి)కి నేనంటే మొదటి నుంచీ ఇష్టం లేదు. ఇంత పెద్ద ఇంట్లో మూడు నెలలుగా(జూన్ నుంచి) నాకు తిండి పెట్టట్లేదు. కిచెన్ తాళాలు వేసుకుని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదు. ఇంట్లో నా పరిస్థితిపై వీడియో తీస్తుంటే, రబ్రీదేవి బాడీ గార్డొచ్చి మొబైల్ లాక్కొనే ప్రయత్నం చేశాడు. అంతా కలిసి నన్ను బయటికి గెంటేశారు. ఇంట్లో నాకు సెక్యూరిటీ లేదు. అందుకే పోలీసులకు ఫోన్ చేశా’’అని ఐశ్వర్య ఏడుస్తూ చెప్పారు. మహిళా హెల్ప్ లైన్ ఆఫీసర్ పరిమళ మీడియాతో మాట్లాడుతూ.. కోడలు(ఐశ్వర్య) వల్ల తనకు కూడా డేంజర్ ఉందని అత్త(రబ్రీదేవి) ఆరోపిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఐశ్వర్యను ఇక్కడే ఉండనివ్వలేమని, తండ్రి ఇంటికి పంపుతామని చెప్పారు. ఈ గొడవ జరుగుతున్నంత సేపు లాలూ కుటుంబీకులెవరూ బయటికి రాలేదు. ఉప ఎన్నికల ప్రచారం కోసం తేజ్ ప్రతాప్, తేజస్వీ ఉదయమే బయటికెళ్లారు. వ్యక్తిగతంగా భర్త(తేజ్ ప్రతాప్), మరిది(తేజస్వీ) ఇబ్బంది పెట్టలేదన్న ఐశ్వర్య.. ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదైందని చెప్పారు. మూడు నెలలుగా పుట్టింటివాళ్లు పంపే భోజనంతోనే కడుపునింపుకుంటున్నానని తెలిపారు. కాపురం నిలబెట్టడానికి తాము ప్రయత్నిస్తుంటే, అటునుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ఐశ్వర్య తండ్రి, బీహార్ మాజీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ అన్నారు.