సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

రాష్ట్రంలో స్కూళ్లు,కాలేజీల క్లారిటీ వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లలో ఫిజికల్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో క్లోజ్ చేసిన స్కూళ్ల రీఓపెనింగ్‌పై సోమవారం ప్రగతి భవన్‌లో  సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన  ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంగన్ వాడీలతో పాటు రాష్ట్రంలోని  అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 నుంచి రీఓపెన్ చేయాలని నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యా సంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30లోగా శానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్ , మున్సిపల్ శాఖ ల మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు. 

పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది

‘‘ కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు తల్లిదండ్రులు సహా ప్రయివేట్ స్కూల్ టీచర్లు తదితర విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పున: ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను కూడా సమావేశంలో క్షుణ్ణంగా చర్చించాం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పై రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో చర్చించాం. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు. ప్రస్థుతం రాష్ట్రంలో కూడా జన సంచారం మామూలు స్థాయిలోకి వస్తున్నది. అదే సందర్భంలో విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్ధినీ విద్యార్థుల్లో ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని, అది వారి భవిష్యత్తు పై ప్రభావం చూపే పరిస్థితి ఉన్నదని వైద్యశాఖ అధికారులు తమ నివేదికను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ దాకా ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ సెప్టెంబర్ 1 నుంచి పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలదే బాధ్యత

ఇన్నాళ్లూ పాఠశాలలు మూతబడి ఉండడం మూలాన, గ్రామాలు పట్టణాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు విద్యాసంస్థల ఆవరణలు పరిశుభ్రంగా పెట్టే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ లదేనని సీఎం పునరుద్ఘాటించారు. మరో వారం రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లతో సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రంగా తయారు చేయాలన్నారు. విద్యాసంస్థల పరిధిల్లోని నీటి ట్యాంకులను తేటగా కడిగించాలన్నారు. తరగతి గదులను కడిగించి సానిటైజేషన్ చేయించాలని సర్పంచులు మున్సిపల్ చైర్మన్లను సిఎం ఆదేశించారు.
ఇందుకుగాను జిల్లా పరిషత్ చైర్మన్లు వారి వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి వారి మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు సానిటైజేషన్ చేసి  పరిశుభ్రంగా వున్నయో లేవో పరిశీలించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాల డిపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు,  ఎంపీడీవోలు, డీపీవోలు, ఎంపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ధారించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 30 తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.