ముషీరాబాద్, వెలుగు : ప్రత్యేక రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఆనందంగా ఉందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బాగ్లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండ రాం, సీహెచ్ విఠల్, ప్రొ.పురపాటి వెంకట నారాయణ, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, పాశం యాదగిరి హాజరై ఉద్యమకారులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడిన ఉద్యమ వీరుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో వంతు సేవలందించిన వివిధ రంగాల ప్రతినిధులను సన్మానించడం భావితరాలకు స్ఫూర్తి నిలపడమేనన్నారు.
