ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీ తీర్మానం

ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీ తీర్మానం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు.

తీర్మానం ప్రతిని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌కు పంపించాలని సభ నిర్ణయించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన తీర్మానానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీలపై చర్యల తీర్మానానికి  అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

స్పీకర్‌ను అవమానించడం అంటే సభను అవమానించడమే

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలు కేవలం స్పీకర్‌కు జరిగిన అవమానం కాదని, మొత్తం శాసనసభకు జరిగిన అవమానమని అన్నారు.స్పీకర్‌ను అవమానిస్తే మొత్తం సభను అవమానించినట్లేనని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాతా మధు, నవీన్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.

ALSO READ : స్పీకర్ కన్నీళ్లు పెట్టుకుంటే బాధేసింది .. 

ఆత్మగౌరవ పోరాటం నుంచి పుట్టిన సభ

తెలంగాణ శాసనసభ ఆత్మగౌరవ పోరాటం నుంచి పుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభ గౌరవం, స్పీకర్ పదవి ప్రతిష్ఠను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సభలో వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలకు తావు ఉండకూడదని, ప్రజాస్వామ్య విలువలు, సభా సంప్రదాయాలను గౌరవిస్తూ సభ్యులు వ్యవహరించాలని ఆయన సూచించారు.స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం ప్రతిని మండలి ఛైర్మన్‌కు పంపించేందుకు సభ నిర్ణయం తీసుకుంది.అనంతరం తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది