అధికారంలోకొచ్చిన 48 గంటల నుంచే.. హామీలు అమలవుతున్నయ్

అధికారంలోకొచ్చిన 48 గంటల నుంచే..  హామీలు అమలవుతున్నయ్
  • ఢిల్లీలోని తెలంగాణ భ‌‌‌‌వ‌‌‌‌న్ రెసిడెంట్ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ గౌర‌‌‌‌వ్ ఉప్పల్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలుచేయడం ప్రారంభించిందని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. 

మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు, రూ. 500 లకే వంటగ్యాస్ సిలిండర్ పంపిణీ, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతన్నలకు రూ. 2 లక్షల వరకూ రుణ మాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకి రూ.500 బోనస్, పంటల బీమా పథకం వంటి స్కీంలను తెచ్చిందన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు, ఉద్యమకారులు, విద్యార్థులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఉప్పల్.. అంబేద్కర్ చిత్రపటానికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.." 76 ఏండ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. దాన్ని స్మరిస్తూ..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. 

వివిధ  దేశాలలో చిక్కుకు పోయిన తెలంగాణ విద్యార్థులు, రాష్ట్ర వాసులను క్షేమంగా మన దేశానికి చేర్చేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కీలకంగా పని చేస్తోంది. అలాగే.. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో నిత్యం సంప్రదిస్తూ, సమన్వయ పరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి  కృషి చేస్తున్నది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని తెలంగాణవాసులకు అండగా ఉండేందుకు త్వరలోనే ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కూడా ప్రజావాణి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం" అని ఉప్పల్ పేర్కొన్నారు.