జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్.. టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్

జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్.. టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్

దసరా పండుగ వేళ దేశ రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలైంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ  ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనంతరం పార్టీ పేరులో మార్పు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి సమర్పించనున్న దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని గుర్తించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి పార్టీ జనరల్ సెక్రెటరీ  లేఖ రాశారు. 

సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో దీన్ని కీలక మలుపుగా అభివర్ణించారు. టీఆర్ఎస్ ను  భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించారు. సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఈసందర్భంగా తమిళనాడుకు చెందిన విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమవలవన్ మాట్లాడుతూ..  కాంగ్రెస్ ను కూడా బీఆర్ఎస్ కలుపుకుపోవాలని కోరారు. 

బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచి, బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. ‘దేశ్ కీ నేత జిందాబాద్’, ‘బీఆర్ఎస్ జిందాబాద్’ నినాదాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో జనతాదళ్ (ఎస్) నేత, కర్ణాటక మాజీ సీఎం  కుమారస్వామి కూడా పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్సీ కవిత ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. పార్టీ పేరు మార్పుపై ప్రకటన చేసిన అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ నుంచి క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు,అతిథులకు ప్రగతిభవన్ లో భోజన ఏర్పాట్లు చేశారు.