ఏపీ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్

ఏపీ గడ్డపై  సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్

 వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టేవాళ్లు నిజమైన వారసులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  వైఎస్సార్ ఆశయాలు మరిచిపోయిన వాళ్లు వారసులు కాదన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే పేరుతో  వైజాగ్ లో  కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ పాల్గొన్నారు.  పదేళ్లు పూర్తవుతున్న ఏపీకి రాజధాని లేదని..పోలవరం పూర్తికాలేదన్నారు.  ప్రశ్నించే వాడే లేదు కాబట్టే మోదీ ఏపీని పట్టించుకోలేదని ఆరోపించారు.  

ఏపీకి ఇప్పుడు కావాల్సింది పాలించే  నాయకులు కాదని ప్రశ్నించే గొంతుకలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి . కానీ ఇక్కడి నాయకులు ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆరోపించారు.  ఢిల్లీని డిమాండ్‌ చేసి కావాల్సింది సాధించే నాయకత్వం ఇప్పుడు లేదన్నారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు.  

జగన్, బాబు ఎవరూ గెలిచినా మోదీకి బానిసలేనన్నారు. మోదీని ఎదిరించి శక్తి వీరికి లేదన్నారు.  ఏనాడూ వైఎస్సార్ బీజేపీ అంటకాగలేదన్నారు.  వైఎస్సార్  నిజమైన వారసురాలు షర్మిల అని చెప్పుకోచ్చారు.  25 మంది  కాంగ్రెస్  ఎమ్మెల్యేలు, 5 మంది కాంగ్రెస్   ఎంపీలను ఏపీ  ప్రజలు గెలిపించాలని  కోరారు.


కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అండగా నిలవడానికే వైఎస్ షర్మిల ఇక్కడకు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అచ్చోసిన ఆంబోతుల్లా వారిద్దరూ(చంద్రబాబు, జగన్) తలపడుతుంటే ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం ఆషామాషీ కాదని ఆమెకు తెలుసు. అయినా సరే పోరాటం చేయడానికి షర్మిల ముందుకొచ్చారు. ఆమె నాయకత్వాన్ని ప్రజలు బలపర్చాలి. ఆమె ఏపీ సీఎం పీఠంపై కూర్చునే వరకు నేను తోడుగా ఉంటానని పేర్కొన్నారు.