- సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులును కలిసి కృతజ్ఞతలు తెలిపిన క్వీర్ ఫౌండేషన్ ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్ మహిళకు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స కోసం సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. సీఎం ఎ. రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధులు మంజూరు చేయగా, సర్జరీ విజయవంతంగా పూర్తయింది.
ఈ నేపథ్యంలో క్వీర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎం. ముకందమాల ఆధ్వర్యంలో ప్రతినిధులు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులును కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్స్జెండర్ సమాజ సంక్షేమం, సామాజిక సమగ్రత కోసం సీఎం రేవంత్రెడ్డి అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్కు సమాజంలో సమాన అవకాశాలు కల్పిస్తూ, గౌరవప్రదంగా జీవించే హక్కును బలోపేతం చేసిందని కొనియాడారు. ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం ట్రాన్స్జెండర్లు, ఎల్జీబీటీక్యూ సమాజ సభ్యులకు ఎప్పుడూ అండగా నిలుస్తోందని సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
