
- 22 న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్?..
- 40 మంది పేర్లతో ప్రకటించే చాన్స్
- 20న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ కోసం పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి జాబితాలో సీనియర్ లీడర్లందరి పేర్లు కన్ఫర్మ్ అయిపోతాయని పలువురు భావిస్తున్నారు. అభ్యర్థుల లిస్టును లేట్ చేయకుండా త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు ఏఐసీసీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. 40 మంది అభ్యర్థులతో లిస్టును ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే ఆలస్యమైందని చాలా మంది నేతలు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే.. ఈ నెల 20న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి.. లిస్టును ఏఐసీసీకి ఇవ్వాలని పార్టీ నేతలు యోచిస్తున్నారని తెలిసింది. వాస్తవానికి ఈ నెల 19నే స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించాలనుకున్నప్పటికీ.. సీడబ్ల్యూసీ సమావేశాలు, పార్లమెంట్ మీటింగ్ను దృష్టిలో పెట్టుకుని ఒక రోజు లేట్గా సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అక్కడ లిస్ట్ ఫైనల్ కాగానే.. ఆ జాబితాపై ఏఐసీసీతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. మరోవైపు ఒకేసారి సగం మంది అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ.. 40 మంది పేర్లనే ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ లిస్టులోనే సీనియర్లందరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని పార్టీ నాయకులు అంటున్నారు. ఆ లిస్టు మీద వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి సెకండ్ లిస్టును ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.