22న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..? 40 మందిని ప్రకటించే చాన్స్

22న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..? 40 మందిని ప్రకటించే చాన్స్
  • 22 న కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్ట్​?.. 
  • 40 మంది పేర్లతో ప్రకటించే చాన్స్​
  • 20న ఢిల్లీలో స్క్రీనింగ్​ కమిటీ మీటింగ్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్ట్​ కోసం పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి జాబితాలో సీనియర్​ లీడర్లందరి పేర్లు కన్ఫర్మ్​ అయిపోతాయని పలువురు భావిస్తున్నారు. అభ్యర్థుల లిస్టును లేట్​ చేయకుండా త్వరగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు ఏఐసీసీ  సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. 40 మంది అభ్యర్థులతో లిస్టును ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే ఆలస్యమైందని చాలా మంది నేతలు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే.. ఈ నెల 20న ఢిల్లీలో స్క్రీనింగ్​ కమిటీ సమావేశాన్ని నిర్వహించి.. లిస్టును ఏఐసీసీకి ఇవ్వాలని పార్టీ నేతలు యోచిస్తున్నారని తెలిసింది. వాస్తవానికి ఈ నెల 19నే స్క్రీనింగ్​ కమిటీ మీటింగ్​ నిర్వహించాలనుకున్నప్పటికీ.. సీడబ్ల్యూసీ సమావేశాలు, పార్లమెంట్​ మీటింగ్​ను దృష్టిలో పెట్టుకుని ఒక రోజు లేట్​గా సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

అక్కడ లిస్ట్​ ఫైనల్​ కాగానే.. ఆ జాబితాపై ఏఐసీసీతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. మరోవైపు ఒకేసారి సగం మంది అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ.. 40 మంది పేర్లనే ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ లిస్టులోనే సీనియర్లందరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని పార్టీ నాయకులు అంటున్నారు. ఆ లిస్టు మీద వచ్చే ఫీడ్​బ్యాక్​ను బట్టి సెకండ్​ లిస్టును ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.