- రెగ్యులర్ ప్రమోషన్ ప్యానెల్తోపాటు 2023, 2024 బ్యాచ్ల అసోసియేట్ ప్రొఫెసర్లకూ చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణ ప్రమోషన్ ప్యానెల్తోపాటు గత రెండేండ్ల కాలానికి చెందిన 2023, 2024 బ్యాచ్లను కూడా రాబోయే ప్రమోషన్ల ప్యానెల్లో విలీనం చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నిర్ణయించింది. రెగ్యులర్గా జరిగే ప్రమోషన్ ప్రక్రియకు భిన్నంగా, ఇయర్, ప్యానల్ మినహాయింపులతో గత రెండేండ్ల బ్యాచ్లకు చెందిన వారిని కూడా కలుపుకొని ప్యానెల్ పరిధిని విస్తరించింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య విద్య మరింత బలోపేతం కానున్నది. అలాగే, టీచింగ్ హాస్పిటల్స్లో పేషంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.
రెండేండ్లలో 600 మందికి..
డీఎంఈ తీసుకున్న ఈ నిర్ణయంతో 2025–-26 డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ప్యానెల్లో ప్రమోషన్ కోసం సుమారు 350 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు అర్హత లిస్టులో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో రెగ్యులర్ ప్యానెల్ ద్వారా సుమారు 30 మంది, ప్యానెల్ మినహాయింపు ద్వారా 100 మంది, ప్యానెల్, ఇయర్ మినహాయింపు కింద 220 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు అర్హులుగా ఉన్నారు. నిరుడుకూడా 250 మంది అసోసియేట్లకు కొన్ని మినహాయింపులతో ప్రొఫెసర్లుగా ప్రమోషన్ కల్పించింది. అంటే.. దాదాపు రెండేండ్ల కాలంలోనే సుమారు 600 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు లభించినట్టయింది.
తీరనున్న ప్రొఫెసర్ల కొరత
గత బీఆర్ఎస్ సర్కారు ముందుచూపు లేకుండా జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసింది. దీంతో మెజారిటీ కాలేజీల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా వేధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు ఫ్యాకల్టీ సర్దుబాటుపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్తోపాటు మినహాయింపులతో సాధ్యమైనంతగా ప్రమోషన్లు కూడా ఇస్తున్నది.
ప్రస్తుత నిర్ణయంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత దాదాపు తీరనున్నది. ఈ నిర్ణయంపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) హర్షం వ్యక్తం చేసింది. తీవ్రంగా ఉన్న ప్రొఫెసర్ల కొరతను అధిగమించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నది.
