కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంసెట్ సహా అన్ని ఇతర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ తేదీలను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ఈ పరీక్షలను లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయగా.. తాజాగా జూలై లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో శనివారం నాడు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమై.. ప్రవేశ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్ హెల్త్ ప్రొటోకాల్, యూజీసీ సూచనలను పాటిస్తూ అన్ని ప్రవేశ పరీక్షలను జూలై నెలలో నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంసెట్ ఎగ్జామ్ ను జూలై 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు.
సెట్స్ తేదీలు..
– ఎంసెట్: జూలై 6 నుంచి 9 వరకు
– ఈ సెట్: జూలై 4న
– పీజీఈసెట్ జూలై 1 నుంచి 3 వరకు
– ఐసెట్: జూలై 13న
– పాలిసెట్: జూలై 1న
– లాసెట్: జూలై 10న
– ఎడ్ సెట్: జూలై 15న