అంతర్జాతీయ వేదికపై తెలంగాణ విద్యా సంస్కరణలు.. యూఎన్వో మీటింగ్లో ప్రసంగం

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ విద్యా సంస్కరణలు.. యూఎన్వో మీటింగ్లో ప్రసంగం

న్యూయార్క్‌‌‌‌లో జరిగే మినిస్టీరియల్ బ్రేక్‌‌ఫాస్ట్ మీటింగ్‌‌కు ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫౌండేషనల్ లిటరసీ అండ్‌‌ న్యూమరసీ(ఎఫ్‌‌ఎల్‌‌ఎన్‌‌) కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు ఐక్యరాజ్యసమితి(యూఎన్‌‌జీఏ) వేదికపై ప్రసంగించే అవకాశం దక్కింది.

సెప్టెంబర్ 21న అమెరికాలోని న్యూయార్క్‌‌లో జరగనున్న ఐరాస సర్వసభ్య సమావేశం వారోత్సవాల సందర్భంగా నిర్వహించే మినిస్టీరియల్‌‌ బ్రేక్‌‌ఫాస్ట్‌‌ మీటింగ్​కు ఆమెను ఆహ్వానించారు. గ్లోబల్‌‌ స్కూల్స్‌‌ ఫోరం, లైట్‌‌ హౌస్‌‌ కోయలిషన్లు సంయుక్తంగా ఈ ఆహ్వానాన్ని అందించాయి. 70 దేశాల్లో పని చేస్తున్న 210 విద్యా సంస్థల నెట్‌‌వర్క్‌‌ తెలంగాణ విద్యా విధానాన్ని ఒక నమూనాగా గుర్తించడం గమనార్హం. పర్యటనలో భాగంగా గవర్నమెంట్ పార్టనర్‌‌షిప్స్‌‌, సిస్టమ్స్‌‌ ఛేంజ్‌‌ అండ్‌‌ లిటరసీ రీఫామ్‌‌ అంశంపై జరగనున్న రౌండ్‌‌టేబుల్‌‌ సమావేశంలో యోగితా రాణా ప్రసంగిస్తారు.

దీనిలో ఇథియోపియా, కెన్యా, రువాండా, కంబోడియా తదితర దేశాల ఉన్నతాధికారులు, అంతర్జాతీయ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో ఎఫ్‌‌ఎల్‌‌ఎన్‌‌ సంస్కరణలు, విద్యా ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను ఆమె ఈ సందర్భంగా వివరిస్తారు. దీంతోపాటు ఈ నెల20న నెట్‌‌వర్కింగ్‌‌ సమావేశంలో, 22న ఎడ్యుకేషన్‌‌ హౌస్‌‌ కాన్ఫరెన్స్‌‌లో ఆమె పాల్గొంటారు.