- రూ.11,237 కోట్లు ఇచ్చిన సర్కారు
- కొత్త కాలేజీలు, దవాఖాన్లకు2 వేల కోట్లు
- ఆరోగ్యశ్రీకి రూ.1,343 కోట్లు,
- కేసీఆర్ కిట్కు రూ.443 కోట్లు
- వరంగల్ హెల్త్ సిటీకి గుండు సున్నా
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య రంగానికి ఈసారి బడ్జెట్లో భారీ పద్దు దక్కింది. గతేడాది రూ.6,295 కోట్లు కేటాయిస్తే, తాజాగా రూ.11,237 కోట్లు ప్రతిపాదించారు. అంటే ఏకంగా 78 శాతం కేటాయింపులు పెంచారు. ఇందులో కొత్త మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటళ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. హైదరాబాద్లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు మ్యాచింగ్ గ్రాంట్ కింద మరో రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించారు. ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం కలిపి రూ.1,343 కోట్లు, కేసీఆర్ కిట్ స్కీమ్కు రూ.443 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్కు రాష్ట్ర వాటా కింద రూ.115 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ కింద జరిగే కార్యక్రమాల కోసం రూ.1,190 కోట్లు ప్రతిపాదించారు.
టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా కొనుగోళ్లకు 377 కోట్లు
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 8 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.250 కోట్లు కేటాయించారు. ఇందులో సర్జికల్స్కు రూ.వంద కోట్లు, రీఏజెంట్స్ కోసం రూ.150 కోట్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ దవాఖాన్లకు అవసరమైన మందులను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోళ్ల కోసం గతేడాది రూ.253 కోట్లు ఇవ్వగా, ఈ సారి రూ.377 కోట్లకు పెంచారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటళ్ల అప్గ్రేడేషన్, ఎక్విప్మెంట్, డయాగ్నస్టిక్స్ రీఏజెంట్స్ కొనుగోళ్ల కోసం పోయినసారి రూ.4 కోట్లు కేటాయించగా, ఈసారి ఏకంగా రూ.550 కోట్లు కేటాయించారు. ఈ హాస్పిటళ్ల నిర్వాహణ బడ్జెట్ను రూ.48 కోట్ల నుంచి 108 కోట్లకు పెంచారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల అప్గ్రేడేషన్ కోసం రూ.50 కోట్లు, పీహెచ్సీలకు అవసరమైన ఎక్విప్మెంట్స్, డయాగ్నస్టిక్ రీఏజెంట్స్, తదితరాల కొనుగోలు కోసం మరో రూ.125 కోట్లు కేటాయించారు.
హెల్త్ సిటీకి పైసలేవీ?
గ్రేటర్ వరంగల్లో హెల్త్ సిటీని నిర్మిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అక్కడ నిర్మించబోయే 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు పేర్కొంది. కానీ బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించకపోవడం గమనార్హం. నిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం 1,500 బెడ్లు ఉండగా, అదనంగా మరో 2 వేల బెడ్లను అందుబాటులోకి తేస్తున్నామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందుకోసం కొత్త బిల్డింగులు నిర్మించనున్నారు. దీని కోసం నిమ్స్కు రూ.15.67 కోట్లు కేటాయించారు. ఎంఎన్జే దవాఖాన బడ్జెట్ను రూ.20 కోట్ల నుంచి 32.76 కోట్లకు పెంచారు. ఇదే దవాఖానలో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.8 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ దవాఖాన్లలో పారిశుధ్య నిర్వహణ కోసం రూ.338 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత ప్రభుత్వ దవాఖాన్లలో పేషెంట్లకు ఇచ్చే డైట్ చార్జీలను రూ.40 నుంచి రూ.80కి పెంచారు. టీబీ, క్యాన్సర్ రోగుల డైట్ చార్జీలను రూ.56 నుంచి రూ.112 చేశారు. హైదరాబాద్లోని పెద్ద దవాఖాన్లలో ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్ల అటెండెంట్లకు సబ్సిడీలో భోజన సదుపాయం కల్పిస్తామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు.