
- 26,357 జలాశయాల్లో 85.60 కోట్ల చేప పిల్లల విడుదలకు ఓకే
- నేటి నుంచి టెండర్లు
- బిడ్ల దాఖలుకు 23 దాకా గడువు
- మత్స్యశాఖ సీడ్ ఉత్పత్తి 10 శాతమే
- ఆరేండ్లుగా 80% సీడ్ ఏపీ నుంచే సరఫరా
హైదరాబాద్, వెలుగు : చేప పిల్లల ఉచిత పంపిణీ పథకానికి రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేలకుపైగా నీటి వనరుల్లోకి 85 కోట్లకుపైగా చేప పిల్లలను విడుదల చేసేందుకు ఓకే చెప్పింది. మత్స్యకారుల కుటుంబాలకు చేయూతను ఇవ్వడంతోపాటు, చేపల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేందుకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,357 చెరువులు, నీటి వనరుల్లోకి 85,60,77,502 చేప పిల్లలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ వానాకాలం సీజన్లో వర్షాలు కురిసి చెరువులు, ప్రాజెక్టులు నిండిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో చేప పిల్లలను విడుదల చేయడానికి మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాలు, గ్రామాలవారిగా మత్య్స సహకార సొసైటీల్లోని సభ్యులందరికీ చెరువుల్లో భాగస్వామ్యం కల్పించనున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని చెరువుల్లో సోసైటీ సభ్యులు చేపలు పట్టుకునేందుకే ప్రభుత్వం ఈ పథకం కింద ఉచితంగా చేప పిల్లలను అందిస్తోంది.
23న మధ్యాహ్నం వరకూ టెండర్లు..
చేప పిల్లలను సేకరించడానికి ఫిషరీష్ డిపార్ట్మెంట్ ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చెరువుల కెపాసిటీని బట్టి చేప పిల్లలను విడుదల చేయనున్నారు. వీటిలో చిన్న సైజుతో పాటు పెద్ద సైజు చేప పిల్లలను కూడా వేసేలా చర్యలు చేపడుతున్నారు. చేప పిల్లల సేకరణ కోసం సోమవారం నుంచే టెండర్లు స్వీకరించనున్నారు. ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం బిడ్డింగ్లు ఓపెన్ చేయనున్నారు. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో చేప పిల్లల టెండర్లను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
చేప పిల్లల సైజ్ బట్టి ధరలు..
భారీ, మధ్యతరహా, చిన్న రిజర్వాయర్లలో 80- నుంచి 100 మి.మీ. సైజు చేప పిల్లలను విడుదల చేయనున్నారు. చేప పిల్లల సైజు, ప్రతిపాదిత ధరను ఆఫీసర్లు ఖరా రు చేశారు. పెద్ద సైజు ఫిష్ సీడ్ను రూ.1.63 చొప్పున ధరకు సేకరించాలని ప్రతిపాదించారు. అదే విధంగా సీజనల్ వాటర్ బాడీస్లో 35- నుంచి 40 మిల్లీ మీటర్ల సైజు చేప పిల్లలు విడుదల చేయనున్నారు. ఈ సైజు చేప పిల్లకు 61 పైసల చొప్పున ధరను ప్రతిపాదించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు లోబడి వేసిన వారికి టెండర్లను ఖరారు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో టెండర్లను ఖరారు చేయనున్నారు. ఆగస్టు చివరి వరకు చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. అయితే, ఏటా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నా.. చేప పిల్లల విడుదల సమయంలో మాత్రం సంఖ్యకు అనుగుణంగా వేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
మత్స్యశాఖ సీడ్ స్వల్పమే..
రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపా లని చేపట్టిన చేప పిల్లల పంపిణీ పథకం ఆరేండ్లుగా కొనసాగుతోంది. కానీ ఇప్పటికీ కనీసం సొంతంగా చేప పిల్లల సీడ్ తయారు చేసుకునే పరిస్థితి లేదు. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఆంధ్రా నుంచే అధిక శాతం చేప పిల్లలను సేకరిస్తున్నారు. మత్స్యశాఖ సొంతంగా సీడ్ తయారు చేసుకునేందుకు వనరులను వినియోగించుకోకుండా కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, గతంలో చేపల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 85.60 కోట్ల చేప పిల్లల అవసరం ఉంటే ఇందులో మత్సశాఖ ఆధ్వర్యంలో నీటి వనరుల్లో పెంచుతున్న చేప పిల్లల సీడ్ కనీసం 10 శాతం కూడా ఉండడం లేదు. దీంతో 95 శాతానికిపైగా చేప పిల్లలను కొని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జలాశయాల్లో చేప పిల్లలను పెంచుకునే వెసులుబాటు ఉన్నా ఆంధ్రా నుంచి చేపల సీడ్ తెప్పించుకోవడంలో పెద్ద ఎత్తున అవినీతి దాగుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెండర్లు ఇక్కడ్నుంచి.. సీడ్ అక్కడ్నుంచి..
టెండర్ల ద్వారా సేకరిస్తున్న వాటిలో 60 శాతం తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, నల్గొండ, కరీంనగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట్ ఏరియాల్లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల నుంచి సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మిగతా 40 శాతం ఏపీలోని కేంద్రాల నుంచి సేకరిస్తున్నామని అంటున్నారు. కానీ కొందరు వ్యాపారులు తెలంగాణ కేంద్రాల పేరిటే టెండర్లు దక్కించుకున్నా.. 70 నుంచి 80 శాతానికిపైగా ఫిష్ సీడ్ ను మాత్రం ఏపీలోని ఏలూరు, కైకలూరు, భీమవరం నుంచే సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యేడు కొత్త సర్కారు అయినా ఇలాంటి అక్రమాలు జరగకుండా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.