అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌..  ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో చేర్చాలని నిర్ణయం

అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌..  ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో చేర్చాలని నిర్ణయం

అంగన్‌వాడీలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి కూడా పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్‌ బిల్లులను కూడా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను ఆదివారం (అక్టోబర్ 1న) మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు.

మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌తో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు ఆదివారం (అక్టోబర్ 1న) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి హరీశ్‌ తెలిపారు.  తమ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల వైఖరిపై అంగన్‌వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.