- ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ఆదివారం దేవరకొండ మండలంలోని తాటికోల్ రైతు వేదికలో జరిగిన ‘ప్రజాపాలన - రైతు ఉత్సవాల’లో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతు భరోసా (యాసంగి-2026) నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు డిండి మండలంలోని సోమ్లా తండా, కామేపల్లి గ్రామాల్లో రూ. 10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం దేవరకొండ పట్టణంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 251 మంది లబ్ధిదారులకు రూ. 92.61 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
