కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ

గవర్నర్ తమిళిసై ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. గవర్నర్ గా మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని, నాలుగో సంవత్సరంలోకి  ప్రవేశించిన సందర్భంగా అమిత్ షాను కలిశానని ఆమె తెలిపారు. ఇది సాధారణ మీటింగ్ మాత్రమేనని గవర్నర్ స్పష్టం చేశారు. గత మూడేళ్లకు సంబంధించిన రిపోర్టును కేంద్రానికి ఇచ్చానని తెలిపారు. అయితే ఈ భేటీలో తెలంగాణలోని పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి, మునుగోడు బై పోల్ పరిణామాలు, మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారంపైనా చర్చ జరిగి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మునుగోడు బై పోల్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లి అమిత్ షా తో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.  

విద్యాశాఖ మంత్రి వచ్చి నాతో మాట్లాడాలి

ఇక విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాల భర్తీని పర్యవేక్షించే ‘కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుపై  రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఉదయమే గవర్నర్ లేఖ రాశారు.  రాజ్ భవన్ కు వచ్చి ఈ బిల్లు గురించి తనతో చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఆమె సూచించారు. గత 8 సంవత్సరాలుగా వర్సిటీల్లో రిక్రూట్మెంట్స్ ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రిక్రూట్మెంట్స్ చేస్తే ఎలా చేస్తారు ? లోకల్ అభ్యర్థులకు ఎంతమేరకు ప్రాధాన్యత ఉంటుంది ? కేటగిరీల విభజన ఎలా ఉంటుంది ? అనే అంశాలపై రాష్ట్ర సర్కారును గవర్నర్ వివరణ కోరారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మధ్యలో ఎన్నికల కోడ్ వస్తే వర్సిటీల్లో నియామక ప్రక్రియలు నిలిచిపోయే అవకాశం ఉందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై గవర్నర్ తమిళిసై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి కూడా లేఖ రాశారు. యూనివర్సిటీల ఉద్యోగ ఖాళీలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం చెల్లుబాటు అవుతుందా ?  కాదా ?  అనే దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అభిప్రాయాన్ని కూడా గవర్నర్ కోరారు.