గోదావరి, కావేరి అనుసంధానం .. ఇచ్చంపల్లి నుంచి వద్దు

గోదావరి, కావేరి అనుసంధానం  .. ఇచ్చంపల్లి నుంచి వద్దు
  • తుపాకులగూడెం నుంచి నీళ్లు మళ్లించుకుంటే ఓకే 
  • ఎన్​డబ్ల్యూడీఏ సమావేశంలో తేల్చిచెప్పిన తెలంగాణ 
  • గోదావరి-కావేరి లింకింగ్​కు 5 రాష్ట్రాలూ అంగీకారం  

హైదరాబాద్, వెలుగు: గోదావరి– కావేరి నదుల అనుసంధానం కోసం ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించడానికి ఒప్పుకోబోమని తెలంగాణ తేల్చిచెప్పింది. శుక్రవారం జలసౌధలో నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) టాస్క్​ఫోర్స్​కమిటీ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు​ వెదిరె శ్రీరామ్​ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎన్​డబ్ల్యూడీఏ డీజీ భోపాల్​సింగ్, వివిధ రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. 


మీటింగ్ లో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి (148 టీఎంసీలు), బెడ్తి – వారాదా (18 టీఎంసీలు) రివర్​లింకింగ్​ప్రాజెక్టులపై చర్చించారు. ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్​లు ఈ ఏడాది డిసెంబర్​30వ తేదీకల్లా సిద్ధం చేసి అన్ని రాష్ట్రాలకు అందజేస్తామని వెదిరె శ్రీరామ్​తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీకల్లా ఈ ప్రాజెక్టుల ఎంవోయూలపై ఆయా రాష్ట్రాల సీఎంలతో సంతకాలు చేయించేలా ప్రయత్నిస్తామన్నారు. గోదావరి – కావేరి రివర్​లింకింగ్​లో రాబోయే 20 ఏండ్లల్లో చత్తీస్​గఢ్​ఉపయోగించుకోని 148 టీఎంసీలను మాత్రమే తరలిస్తామని, చత్తీస్​గఢ్​ఆ నీటిని వినియోగించుకోవడం మొదలుపెట్టగానే ఆపేస్తామని తెలిపారు. మహానది – గోదావరి రివర్​లింకింగ్​లో 230 టీఎంసీలు తరలిస్తామని, రాబోయే 20 ఏండ్లలోపు ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. గోదావరి – కావేరి రివర్​లింకింగ్​కు అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఈ నెల 22న నిర్వహించే ఎన్​డబ్ల్యూడీఏ గవర్నింగ్​బాడీ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చి, దీనిపై చర్చిస్తామని శ్రీరామ్ తెలిపారు. 
  
సమ్మక్క సాగర్ నుంచి ఓకే: తెలంగాణ  

తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​మాట్లాడుతూ.. గోదావరి – కావేరి అనుసంధానం ప్రాజెక్టు కోసం ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కట్టాలనే ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ నుంచి రివర్​లింకింగ్​చేపడితే  ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై స్టడీ చేసి ఆయా రాష్ట్రాలకు నీటి వాటాలను కేటాయించాలని.. దాని ప్రకారం హైడ్రాలజీ ఫ్రీజ్​చేయాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్​ల ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.   

నీటి లభ్యతపై స్టడీ చేయాలె: ఏపీ 

గోదావరి – కావేరి అనుసంధానానికి భూసేకరణే ప్రధాన సమస్య అని ఏపీ ఇరిగేషన్​ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్​కుమార్​అన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా పోలవరం కుడి కాలువ నుంచి నాగార్జున సాగర్ (కృష్ణా).. ​అక్కడి నుంచి శ్రీశైలం (కృష్ణా) మీదుగా సోమశిల (పెన్నా).. అక్కడి నుంచి గ్రాండ్​ఆనికట్(కావేరి)కి నీటిని తరలించే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గోదావరిలో మిగులు జలాలే లేవని, గతంలో ఇచ్చిన హైడ్రాలజీ రిపోర్టులోని వ్యత్యాసాలను సీడబ్ల్యూసీకి అప్పుడే నివేదించామని తెలిపారు. నీటి లభ్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరారు. బెడ్తి – వారాదా లింక్​ప్రాజెక్టులో తరలించే 50 శాతం నీటిని తమ రాష్ట్రానికి కేటాయిస్తే తుంగభద్ర హైలెవల్​కెనాల్​ద్వారా రాయలసీమకు నీటిని ఇచ్చే అవకాశం ఏర్పడుతుందన్నారు. రివర్​లింకింగ్ లోని టెక్నికల్​అంశాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

మరో మూడు రాష్ట్రాలూ రెడీ 

గోదావరి – కావేరి అనుసంధానానికి తాము మద్దతిస్తామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అధికారులు కూడా ప్రకటించారు. నీటి లోటు ఉన్న బేసిన్​లోని అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉంటుందనే దీనికి అంగీకారం తెలుపుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్​దేశ్​పాండే, ఇంటర్​స్టేట్​ఎస్ఈ కోటేశ్వర్​రావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్, చత్తీస్​గఢ్​ఇరిగేషన్​సీఈ కుబేర్​సింగ్, కర్నాటక నుంచి రాకేశ్​సింగ్, తమిళనాడు నుంచి సక్సేనా తదితరులు పాల్గొన్నారు.