హైదరాబాద్, వెలుగు: గోదావరి నదిలో నీటి లభ్యతను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తన నివేదికలో తక్కువగా చూపించిందని, తమ రాష్ట్రానికి 967.94 టీఎంసీలు దక్కుతాయని తెలంగాణ తేల్చిచెప్పింది. ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్ శనివారం గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (జీఆర్ఎంబీ) చైర్మన్ ఎంకే సిన్హాకు ఈ మేరకు లేఖ రాశారు.
గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ఇటీవల ఇచ్చిన నివేదికలో సబ్బేసిన్ల వారీగా నీటి లభ్యత తక్కువగా చూపించారని ఆయన తెలిపారు. జీ10 (కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలిసే సంగమ ప్రాంతం నుంచి ఇంద్రావతి సంగమం వరకు) నీటి లభ్యతలో 28.84 టీఎంసీలు తక్కువగా చూపించారని ఆయన పేర్కొన్నారు.
జీ10 సబ్ బేసిన్లో 287.18 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టులను ఇప్పటికే నిర్మించారని, 126.64 టీఎంసీల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ‘‘8.88 టీఎంసీలను భవిష్యత్తులో చేపట్టాల్సి ఉంది. 12.20 టీఎంసీలు థర్మల్ప్రాజెక్టుల వాటాగా ఉంది. మొత్తంగా ఈ సబ్బేసిన్లో ప్రాజెక్టులకు 434.91 టీఎంసీలు కేటాయించారు. కానీ, సీడబ్ల్యూసీ స్టడీలో నీటి లభ్యతను తక్కువగా చూపించారు. ” అని మురళీధర్ పేర్కొన్నారు.
