- భావితరాలకు దిక్సూచిలా నివేదిక ఉండాలి: కమిటీ చైర్మన్ పొన్నం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, విద్వేషపూరితమైన నేరాల నివారణ బిల్లు–2026 దేశానికే రోల్ మోడల్గా నిలవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ మేరకు సెలెక్ట్ కమిటీ నిష్పాక్షిక, నిర్ణయాత్మక నివేదిక రూపొందించాలని సూచించారు. శనివారం అసెంబ్లీలో కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెలెక్ట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ కమిటీలో అందరూ సీనియర్ సభ్యులు ఉన్నందున ఈ బిల్లును సమగ్రంగా పరిశీలించి నివేదికను శాసనసభకు సమర్పించాలని సూచించారు. పార్లమెంటరీ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచేలా ఈ కమిటీ సిఫార్సులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భావితరాలకు మార్గదర్శకంగా ఉండేలా నివేదిక రూపొందిస్తామన్నారు. వర్షాకాల సమావేశాల్లోపే సభ ముందుకు ఈ నివేదికను తీసుకొస్తామని తెలిపారు.
