- ప్రత్యామ్నాయ వేదిక వద్ద తేల్చుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: వివాదాల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యామ్నాయ వేదిక అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా హైకోర్టును ఆశ్రయించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందంలో ఆర్బిట్రేషన్ ద్వారా వివాదాల పరిష్కారానికి నిబంధన ఉన్న నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకోదని పేర్కొంది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్ విధానంలో 2007లో హెచ్ఎండీఏ, హైదరాబాద్ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ (హెచ్ఈఎల్) మధ్య కుదిరిన రాయితీ ఒప్పందంలో వివాదం తలెత్తింది. ఒప్పందంలోని క్లాజ్-39 ప్రకారం తలెత్తే వివాదాలను ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. అయితే, కన్సార్టియంలో షేర్ హోల్డింగ్ మార్పులు, దివాలా పరిష్కార ప్రక్రియ, అనుమతి లేకుండా వాటాల బదలాయింపు జరిగిందని పేర్కొంటూ ఐసీఏ జారీ చేసిన నోటీసులు చెల్లవని హెచ్ఎండీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇరు వాదనలను పరిశీలించిన ధర్మాసనం.. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా హైకోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో చట్టపరమైన హక్కుల ఉల్లంఘన కనిపించలేదని పేర్కొంది. షేర్హోల్డింగ్కు సంబంధించిన అభ్యంతరాలను పరిశీలించే అధికారం ఐసీఏకే ఉందని తెలిపింది. ఐసీఏ నోటీసుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.
