
హైదరాబాద్: గ్రూప్ –1 మెయిన్స్ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటాయని పేర్కొంటూ కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. దీనిపై ఇవాళ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధమంటూ ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నిర్వహించారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించిందని కోర్టుకు తెలిపారు.
గ్రూప్-1 నిర్వహణ రూల్స్లో.. రీవాల్యూయేషన్ అనేది లేదని చెప్పారు. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉందని తెలిపారు. కేవలం ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఈ తీర్పు సహేతుకం కాదు అని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. నియామకాలు జరుపుకోవచ్చంటూ ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పునకు లోబడే నియామకాలుంటాయని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఆధారాలున్నాయా..?
టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ తీర్పులో ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని పేర్కొంది. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటివి ఏమైనా జరిగాయా..? అంటూ హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పులో చాలా డెలికేట్ పదాలు ఉన్నాయని వివరించింది. బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉపయోగించారని.. బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్ చేశారా..? అంటూ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.