హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఎల్ఐజీ టవర్స్కు అప్లై చేసుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఫ్లాట్స్ కోసం ఇప్పటి వరకు ఆధార్ను మాత్రమే అడ్రస్ ఫ్రూప్గా పరిగణించగా.. ఇక నుంచి రెసిడెన్స్, స్థానికత నివాస ప్రాంతాన్ని అడ్రస్ ఫ్రూప్గా ఏ డాక్యుమెంట్ ఉన్నా పరిగణిస్తామని హౌసింగ్ బోర్డు వెల్లడించింది. ఇందులో ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టులను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. వచ్చే నెల 10 వరకు అప్లైకి గడువు విధించగా ఇప్పటి వరకు సుమారు 15 వేల మంది అప్లై చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
కాగా, క్యూర్ పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో దానికి 480 ఫ్లాట్ల చొప్పున తొలి దశలో 7,680 ఎల్ ఐ జీ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ నెల 20 నుంచి ఆయా నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు అప్లై చేసుకుంటున్నారు. ఫ్లాట్ వ్యయం రూ.11 లక్షలు కాగా ఇందులో ఇందిరమ్మ ఇంటి స్కీమ్ కింద రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తుండగా మిగతా రూ.6 లక్షలను ప్రజలు దశల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.
