కుటుంబ వివరాలన్నీ ఒకేచోట.. అందుబాటులోకి ఫ్యామిలీ సర్టిఫికెట్

కుటుంబ వివరాలన్నీ ఒకేచోట.. అందుబాటులోకి ఫ్యామిలీ సర్టిఫికెట్
  • ఎమ్మార్వో ఆఫీసు, మీ సేవా కేంద్రాల్లో పొందొచ్చు

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌరులు,  వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా అందించేందుకు వీలుగా ప్రభుత్వం ‘ఫ్యామిలీ సర్టిఫికెట్ ’ అందిస్తున్నది. 

ఈ సర్టిఫికెట్‌‌ జారీ ప్రారంభమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  చెప్పారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి,  సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, ఇతర ప్రభుత్వ పథకాలను పొందుతున్న వారి వివరాలన్నింటినీ  ఆయా తహసీల్దార్​  కార్యాల‌‌యాల్లో అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. శుక్రవారం మ‌‌హాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భ‌‌వ‌‌న్‌‌లో ఏర్పాటు చేసిన ‘సర్‌‌‌‌’ అవ‌‌గాహ‌‌న స‌‌ద‌‌స్సులో భట్టి విక్రమార్క మ‌‌ట్లాడారు.  

రాష్ట్రంలోని ఏ పౌరుడైనా తమ కుటుంబ సభ్యుల సమాచారం కావాలనుకుంటే తహసీల్దార్ ఆఫీస్‌‌లోగానీ,  మీసేవా కేంద్రానికి వెళ్లిగానీ ఈ ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ పొందొచ్చని చెప్పారు.  ఫ్యామిలీ సర్టిఫికెట్ అన్ని చోట్లా చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, వివిధ అధికారిక అవసరాలు, కుటుంబ వివరాలను సమర్పించాల్సిన సందర్భాల్లో ఈ ధ్రువపత్రం కీలకంగా మారనుందని తెలిపారు.

ఇప్పటివరకు కుటుంబ వివరాల ధ్రువీకరణ కోసం ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంతోపాటు  ప్రజలకు సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాక‌‌ర్‌‌, మైనారిటీ రెసిడెన్షియ‌‌ల్ ఎడ్యుకేష‌‌న‌‌ల్ ఇనిస్టిట్యూష‌‌న్స్ సొసైటీ వైస్ చైర్మన్ ఫ‌‌హీమ్ ఖురేషి త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు.