మెడికల్ కాలేజీల్లో డాక్టర్ల డిప్యుటేషన్లు రద్దు .. మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ

మెడికల్ కాలేజీల్లో డాక్టర్ల డిప్యుటేషన్లు రద్దు .. మెడికల్ ఎడ్యుకేషన్  ఆదేశాలు జారీ

తక్షణమే పోస్టింగ్​ ప్రాంతంలో విధుల్లో చేరాలి
 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్  కాలేజీలు, బోధనాసుపత్రుల్లో డిప్యుటేషన్‌‌పై పనిచేస్తున్న అసిస్టెంట్  ప్రొఫెసర్లు, అసోసియేట్  ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల డిప్యూటేషన్‌‌లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మెడికల్  డైరెక్టర్  ఆఫ్  మెడికల్  ఎడ్యుకేషన్  డాక్టర్  ఎ.నాగేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యుటేషన్​లో ఉన్న ఆయా డాక్టర్లు తక్షణమే వారి అసలు పోస్టింగ్‌‌ల వద్ద రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని, ఎలాంటి జాప్యం జరిగినా తీవ్రంగా పరిగణిస్తామని ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను ఆయన హెచ్చరించారు. అమలుకు సంబంధించిన నివేదికను వెంటనే కార్యాలయానికి పంపాలని సూచించారు. కాగా.. వాస్తవ పోస్టింగ్ లో కాకుండా ఇతర ప్రాంతాలలో డిప్యుటేషన్​పై పనిచేస్తున్న వారిలో  38 మంది అసిస్టెంట్, అసోసియేటివ్​ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. 

ఎన్ఎంసీ నోటీసులతోనే అలర్ట్​

26 మెడికల్  కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్  సెక్రటరీ, డీఎంఈ ప్రత్యక్షంగా హాజరుకావాలని ఎన్ఎంసీ షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. మౌలిక సదుపాయాలు, క్లినికల్  మెటీరియల్, బోధనా సిబ్బందిలో లోపాలు  ఉండడంతోనే ఎన్ఎంసీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా, గాంధీ మెడికల్  కాలేజీ, ఉస్మానియా మెడికల్  కాలేజీ, రాజీవ్  గాంధీ ఇన్‌‌స్టిట్యూట్  ఆఫ్  మెడికల్  సైన్సెస్ (రిమ్స్) ఆదిలాబాద్, ప్రభుత్వ మెడికల్  కాలేజీ నిజామాబాద్, ప్రభుత్వ మెడికల్  కాలేజీ మహేశ్వరం, ప్రభుత్వ మెడికల్  కాలేజీ యాదాద్రి, ప్రభుత్వ మెడికల్  కాలేజీ వికారాబాద్  వంటి కొన్ని కాలేజీలకు ఈ నోటీసు నుంచి మినహాయింపు ఉంది. మిగిలిన 26 కాలేజీలు ఎన్​ఎంసీ లేవనెత్తిన సమస్యలకు స్పందించాలని ఉత్తర్వులు జారీ చేశారు.