రైతు బంధు ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర: మంత్రి కేటీఆర్

రైతు బంధు ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ అంటేనే... రైతు విరోధి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్స్ సమయంలో  బీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. రైతుబంధు నిధులను నిలిపేయాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. దీంతో ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. ఇంటింటికి తాగునీరు, 24 గంటల కరెంట్ కూడా ఆపేయమంటారేమో? అని విమర్శించారు. 

 పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కాంగ్రెస్ కుట్రను రైతులు సహించరన్నారు.  రైతు బంధు ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కత్తిరిస్తామన్నారు. రైతు బంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్నారని.. కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి అన్నారు.

Also Read : భైంసాలో ప్రశాంతంగా దుర్గామాత నిమజ్జనం

నమ్మి ఓటేసి కాంగ్రెస్ పార్టీని  గెలిపిస్తే.. కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారని..  కాంగ్రెస్ వస్తే తెలంగాణలోనూ ఇదే జరుగుతుందన్నారు. నీళ్లు, కరెంట్ ఇవ్వని కాంగ్రెస్ కావాలో.. 24 గంటల కరెంట్, నీళ్లు, పెట్టుబడి సాయం అందిస్తున్న కెసిఆర్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.