- ప్రభుత్వ, కార్పొరేట్ కంపెనీల స్టాళ్ల సందర్శన
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను రెండో రోజూ విజిటర్స్ పెద్ద ఎత్తున సందర్శించారు. గురువారం “డిస్కవర్ తెలంగాణ: కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్–జెన్ టూరిజం” అనే సదస్సు జరగ్గా, వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ చరిత్ర, మ్యూజియం సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ఆహార సంస్కృతి తదితర విభిన్న కోణాల్లో విలువైన విశ్లేషణలను సదస్సులో పాల్గొన్న వక్తలు వివరించారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఒక సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను వక్తలు వివరించారు. ఈ సదస్సులో డాక్టర్ మామిడి హరి కృష్ణ, బిరద్ రాజారామ్, పి. పద్మావతి, గోపీ బైల్లుప్పాల పాల్గొని మాట్లాడారు.
అనంతరం, తెలంగాణ రైజింగ్- ఎంపవరింగ్ ఆల్, గ్రోవింగ్ టుగెదర్ అనే సదస్సులో ప్రముఖులు విద్యార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో చేపట్టిన ప్రగతిని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్స్ పరిష్కారంలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు, డ్రోన్స్, రోబో తదితర 27కు పైగా స్టాళ్లను సందర్శకులు పరిశీలించారు.

