- అడ్మినిస్ట్రేషన్లో ఉన్నోళ్లకు 61ఏండ్ల తర్వాత 2 ఆప్షన్లు
- ప్రొఫెసర్గా కొనసాగే చాన్స్
- రిటైర్మెంట్ తీసుకునేందుకూ వెసులుబాటు
హైదరాబాద్, వెలుగు: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ల ఉద్యోగ విరమణ విషయంలో సెంట్రల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్లో అమలవుతున్న ‘ఆప్షన్’ సిస్టమ్ను అడాప్ట్ చేసుకోవాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏడీఎంఈల రిటైర్మెంట్ ఏజ్ 61ఏండ్లు, ప్రొఫెసర్లది 65ఏండ్లుగా ఉంది. ప్రొఫెసర్లు ఏడీఎంఈగా ప్రమోషన్ తీసుకోవడంతో 61 ఏండ్లకే రిటైర్డ్ కావాల్సి వస్తున్నది. దీంతో ఏడీఎంఈ, డీఎంఈ పోస్టుల రిటైర్మెంట్ ఏజ్ను 65ఏండ్లకు పెంచేందుకు ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లును ఇటీవల గవర్నర్ రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలో ఎయిమ్స్ వంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో అమలు చేసే పద్ధతిని అడాప్ట్ చేసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
ఎయిమ్స్లో ఇలా..
ప్రస్తుతం ఎయిమ్స్ వంటి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్లో సీనియర్ ప్రొఫెసర్లలో నుంచి కొంత మందిని ఎంపిక చేసి డైరెక్టర్లుగా, డీన్లుగా బాధ్యతలు ఇస్తున్నది. మూడేండ్ల పదవీకాలం లేదా 61ఏండ్ల వయసు పూర్తయిన తర్వాత, వారిని ఆయా పోస్టుల్లో నుంచి తప్పిస్తూ వారికి రెండు ఆప్షన్లు ఇస్తున్నది. ఇందులో మొదటిది ప్రొఫెసర్గా 65ఏండ్ల వయసు వచ్చే దాకా కొనసాగడం కాగా, రెండో ఆప్షన్ వెంటనే రిటైర్ అయిపోవడం. దీంతో చాలా మంది ప్రొఫెసర్లు 61ఏండ్ల తర్వాత, రెండో ఆప్షన్ తీసుకుని ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కూడా ఇదే పద్ధతిని అమలు చేస్తే అసలు ఏజ్ హైక్ బిల్లు పెట్టాల్సిన అవసరమే ఉండదని మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ తరహా సిస్టమ్కు ఎయిమ్స్ నిబంధనలు కూడా అడ్డురావంటున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే ఈ విషయాన్ని వివరించామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
150 మంది ఎలిజిబుల్
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం.. ప్రొఫెసర్గా ఐదేండ్ల అనుభవం ఉన్నవారెవరైనా, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్గా పనిచేయొచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో ఐదేండ్ల అనుభవం ఉన్న ప్రొఫెసర్లు సుమారు 150 మంది ఉన్నారు. ఇందులో ఆరుగురికి మాత్రమే 61ఏండ్లు దాటగా, మిగిలిన వాళ్లంతా అంతకంటే తక్కువ ఏజ్వాళ్లే ఉన్నారు. వీరినే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా, ఇతర అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లోనూ వినియోగించుకోవచ్చు. 61ఏండ్లు వచ్చాక, వారిని తిరిగి ప్రొఫెసర్లుగా కొనసాగించొచ్చు. ఇందుకోసం ప్రభుత్వ స్థాయిలోనే ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.