
- రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగమవ్వండి
- యూఏఈ మంత్రి ఒమర్ బిన్కు శ్రీధర్ బాబు విజ్ఞప్తి
- తెలంగాణ, యూఏఈ మధ్య జులై 2025 నాటికి రూ.1.26 లక్షల లావాదేవీలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్’ గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏఐ, డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామాతో గురువారం ఆయన భేటీ అయ్యారు.
తెలంగాణను ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’ గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నొవేషన్ హబ్ తదితర ప్రాజెక్టుల గురించి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్స్ చేంజ్’తో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రభుత్వ పాలన తదితర రంగాల్లో కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు.
హైదరాబాద్ లో ‘ఏఐ’ ఆర్ అండ్ డీ సెంటర్ ను ప్రారంభించేందుకు ముందుకు రావాలని యూఏఈ మంత్రి ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామాను ఆహ్వానించారు. యూఏఈతో వాణిజ్యంలో తెలంగాణ భారత్లోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ, యూఏఈ మధ్య జులై 2025 నాటికి రూ.1.26 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని చెప్పారు. చెల్లింపులు, బ్లాక్చెయిన్, డిజిటల్ వాణిజ్యంలో కొత్త ఆవిష్కరణలకు ఫిన్టెక్ శాండ్బాక్స్ అందుబాటులో ఉందన్నారు.
తెలంగాణ–యూఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ
డీప్-టెక్, ఏఐ స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరిన్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ‘ఏఐ, స్టార్టప్ సమ్మిట్’ను యూఏఈతో కలిసి నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. స్మార్ట్ మొబిలిటీ, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణం, ఇ–గవర్నెన్స్ తదితర రంగాల్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ సంస్థలకు మంచి అవకాశాలున్నాయని చెప్పారు.
గేమింగ్లో ‘తెలంగాణ–యూఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ’ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ల ఏర్పాటుకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలమని, ఇక్కడ యూఏఐ కంపెనీలు నానో- జీసీసీలు, డిజిటల్ హబ్స్ ను ప్రారంభించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
‘స్టార్ గేట్’ ప్రాజెక్టులో భాగమవ్వండి: యూఏఈ మంత్రి
తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్’ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూఏఈ మంత్రి ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామా ప్రశంసించారు. ఏఐ, డిజిటల్ ఎకానమీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
100 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో యూఏఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఏఐ ఆధారిత ‘స్టార్ గేట్’ ప్రాజెక్టు గురించి మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. త్వరలో యూఏఐలో నిర్వహించనున్న ‘ఫిన్ టెక్ స్టార్టప్స్’ సమ్మిట్ లో తెలంగాణ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.