హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ వెహికిల్స్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్లను వాహన షోరూంలలోనే పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘వాహన్’లో వ్యక్తిగత వెహికిల్స్ అయిన కార్లు, టూ వీలర్స్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్లను మాత్రమే షోరూంలలో చేస్తున్నారు. ఇదే యాప్ లో కమర్షియల్ వెహికిల్స్ అయిన లారీలు, బస్సులు, ఆటోల పర్మనెంట్ రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేసేందుకు రవాణా శాఖ చర్యలు తీసుకుంటున్నది.
మరో వారం, పది రోజుల్లో మొదటి దశలో ఈ ప్రక్రియను ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ పరిధిలోని షోరూంలలో ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ చెప్పారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలుచేయనున్నట్టు తెలిపారు.
