హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ పై సర్కారు ఫోకస్ పెట్టింది. ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించిన మొత్తం 4,131 ప్రభుత్వ స్కూళ్లలోని ఇన్ స్ట్రక్టర్లకు, ప్రైమరీ హెడ్ మాస్టర్లకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆగస్టు 3 నుంచి 6 వరకు ఇన్ స్ట్రక్టర్లకు నాలుగు రోజుల పాటు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇవ్వనున్నారు. ప్రీప్రైమరీ సెక్షన్లున్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లకు ఆగస్టు 7న ఒక రోజు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు.
ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యే వారికి ఎలాంటి సెలవులు మంజూరు చేయొద్దని, 100 శాతం హాజరు ఉండాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ స్పష్టం చేశారు. ఇన్ స్ట్రక్టర్లు శిక్షణలో ఉన్న సమయంలో స్కూల్ నిర్వహణ దెబ్బతినకుండా హెడ్ మాస్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు డీఈఓలు కోర్సు డైరెక్టర్లుగా, క్వాలిటీ కోఆర్డినేటర్లు జిల్లా స్థాయిలో సమన్వయం చేస్తారని పేర్కొన్నారు.
