- ఆ నెలలో జరగనున్న గ్లోబల్ సమిట్లో ఆవిష్కరణకు సన్నాహాలు
- అప్పటిలోగా స్కిల్స్ వర్సిటీ నిర్మాణం పూర్తి
- ఆ క్యాంపస్లోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ నిర్వహణ
- ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక జోన్ల ఏర్పాటు.. ఫార్చూన్-500 కంపెనీలను ఆకర్షించేలా ప్లాన్
- సాగర్ హైవే నుంచి లైఫ్ సైన్సెస్ హబ్ స్పెషల్ రోడ్డుకు త్వరలోనే సీఎం శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ సమగ్ర మాస్టర్ ప్లాన్ను ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్’ వేదికగా ఆవిష్కరించాలని రాష్ట్ర సర్కారుసూత్రప్రాయంగా నిర్ణయించింది. సింగపూర్ సంస్థ ‘సుర్బానా జురాంగ్’ రూపకల్పన చేస్తున్న ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తుది దశకు చేరుకున్నది. గ్లోబల్సమిట్ నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేసి, అదే ప్రాంగణంలో గ్లోబల్ సమిట్ నిర్వహించేలా పనులు సాగుతున్నాయి.
గుజరాత్లోని గిఫ్ట్ సిటీ 600 ఎకరాల్లో ఉండగా, ఏకంగా30 వేల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్సిటీలో ఫార్చూన్-500 కంపెనీలకు ప్రత్యేక జోన్లు, డేటా సెంటర్లు, ప్రత్యేక జీసీసీ హబ్లను నెలకొల్పేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన జరగగా, క్షేత్రస్థాయి పాలన కోసం ఎఫ్సీడీఏ కార్యాలయం స్థానికంగా అందుబాటులోకి వచ్చింది. నాగార్జునసాగర్ హైవే నుంచి లైఫ్ సైన్సెస్ హబ్కు ప్రత్యేక కనెక్టివిటీ రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతుండడంతో త్వరలోనే పలు అంతర్జాతీయ కంపెనీల శంకుస్థాపనలకు ఫ్యూచర్ సిటీ సిద్ధమవుతున్నది.
మహా నగరాలకు భిన్నంగా ప్లానింగ్
ఇప్పటివరకు దేశంలో రూపుదిద్దుకున్న పారిశ్రామిక హబ్లు, నాలెడ్జ్ సిటీలు కేవలం 500 నుంచి 600 ఎకరాల వరకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాబోయే 5 దశాబ్దాల పారిశ్రామిక అవసరాలను అంచనా వేస్తూ భారత్ ఫ్యూచర్ సిటీని 30 వేల ఎకరాల ప్రాంగణంలో రూపొందిస్తోంది. సుర్బానా జురాంగ్ నిపుణుల బృందం ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, వనరులు, రవాణా సౌకర్యాలను అధ్యయనం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక రవాణా వ్యవస్థల కలయికగా ఈ నగరం రూపుదిద్దుకోనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక మౌలిక వసతులు ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్లోబల్ సమిట్ @ స్కిల్స్ యూనివర్సిటీ
డిసెంబర్లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్’ను ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ శరవేగంగా నిర్మాణమవుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సును ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి స్కిల్స్ వర్సిటీ క్యాంపస్ పనులకు తుది రూపు తీసుకువచ్చి, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలోనే ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇంకోవైపు ఫ్యూచర్ సిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పన, భూసేకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ‘ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ’ (ఎఫ్సీడీఏ) వేగంగా అడుగులు వేస్తోంది. ఈ అథారిటీ కొత్త కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులకు, స్థానిక ప్రజలకు సింగిల్ విండో పద్ధతిలో వేగవంతమైన సేవలు అందిస్తున్నారు. భూముల కేటాయింపు నుంచి అనుమతుల మంజూరు వరకు అన్ని ప్రక్రియలను ఒకే ప్రాంగణంలో త్వరితగతిన పూర్తి చేయనున్నారు.
ఫార్చూన్-500 కంపెనీలకు ఫస్ట్ డెస్టినేషన్గా ఫ్యూచర్ సిటీ
ప్రపంచంలోనే అత్యంత అగ్రగామిగా నిలిచే ఫార్చూన్-500 కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తెలంగాణనే ఎంచుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐటీ, డేటా సెంటర్లు, జీసీసీ సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్లాంటి విభిన్న రంగాల కోసం ప్రత్యేక జోన్లను ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తున్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఫ్యూచర్ సిటీవ్యాప్తంగా భారీ రోడ్డు నెట్వర్క్ను నిర్మిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీలో రూపుదిద్దుకుంటున్న లైఫ్ సైన్సెస్ హబ్ కోసం నాగార్జున సాగర్ జాతీయ రహదారి (ఎన్హెచ్565) నుంచి నేరుగా ప్రత్యేక రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడంతో, త్వరలోనే పలు ప్రముఖ అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్, బయో టెక్నాలజీ కంపెనీలు ఇక్కడ తమ యూనిట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొన్నాయి.
గ్లోబల్ ఐటీ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో రూ. వేల కోట్ల పెట్టుబడితో నూతన డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత వేగంగా జీసీసీలను ఆకర్షిస్తున్న నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించగా, ఈ వ్యవధిలోనే 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ప్రారంభించాయి.
భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీలోనే ఒక ‘ప్రత్యేక జీసీసీ హబ్’ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి వర్క్ ప్లాజాలు, ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలతో రూపుదిద్దుకోనున్న ఈ హబ్తో వేలాది మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.
