తెలంగాణ వర్శిటీ వీసీ ర‌వీంద‌ర్ అరెస్ట్..విద్యార్థుల సంబరాలు

తెలంగాణ వర్శిటీ వీసీ ర‌వీంద‌ర్ అరెస్ట్..విద్యార్థుల సంబరాలు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ  తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. అంతకు ముందు గాంధీ ఆస్పత్రిలో ఆయనకు  వైద్యపరీక్షలు చేశారు. ఏసీబీ సోదాలపై తాను స్పందించలేనన్నారు రవీందర్ గుప్తా.

 రవీందర్ గుప్తా హైదరాబాద్ తార్నాకలోని ఆయన ఇంట్లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నిజామామాబాద్ జిల్లా భీమ్ గల్ లో ప్రైవేట్ కాలేజీకి ఎగ్జామ్ సెంటర్  ఏర్పాటు కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన అడిగిన మొత్తాన్ని ఇస్తుండగా ఏసీబీ అధికారులు  దాడి చేసి పట్టుకున్నారు. యూనివర్శిటీలో వీసీ చాలా అక్రమాలకు ,అవినీతికి పాల్పడుతున్నట్లు ఈసీ సభ్యులు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయగా ఈ నెల 6, 13 తేదీల్లో  ఏసీబీ, విజిలెన్స్ ఆఫీసర్లు సోదాలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్ కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్ మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా తెలంగాణ వర్శిటీ వ్యవహారంలో నవీన్ మిట్టల్ తలదూర్చుతున్నారని వీసీ రవీందర్ గుప్తా మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. రవీందర్ గుప్తా ఏసీబీకి చిక్కిన కొద్దిగంటల వ్యవధిలో నవీన్ మిట్టల్ ను ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించడం గమనార్హం

వర్శిటీలో విద్యార్థుల సంబురాలు

 వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి చిక్కడంతో తెలంగాణ వర్శిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.