
హైదరాబాద్ యువతికి ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కింది. కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ కోసం చేస్తున్న సేవలకు గానూ తెలంగాణకు చెందిన 24 ఏళ్ల కీర్తి రెడ్డికి ఈ అవకాశం లభించింది. కీర్తి రెడ్డి హైదరాబాద్లో స్టాట్విగ్ అనే హెల్త్ కేర్ కంపెనీ నిర్వహిస్తోంది. ఆ కంపెనీ ద్వారా కరోనా వ్యాక్సిన్ను నిల్వచేస్తున్నారు. కీర్తిరెడ్డి ఆ కంపెనీకి సీఓఓగా వ్యవహరిస్తున్నారు. ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి మేనేజ్మెంట్లో గ్లోబల్ మాస్టర్స్ పట్టాను కొత్త కీర్తి రెడ్డి పొందారు. చిన్న వయసులోనే ఈ రికార్డు సాధించిన కీర్తిరెడ్డి.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు.
ఫోర్బ్స్ పత్రిక ప్రతి ఏటా వివిధ రంగాలలో రాణిస్తున్న 30 ఏళ్ళలోపు వారితో ఒక లిస్ట్ విడుదల చేస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన ఫోర్బ్స్ లిస్టులో కీర్తి రెడ్డితో సహా మరో 12 మంది మహిళలు ఈ లిస్టులో చోటు సంపాదించుకున్నారు. వారిలో సినీ నటీమణులు కీర్తి సురేష్, తృప్తి దిమ్రి కూడా ఉండటం గమనార్హం. సుప్రీం కోర్టు న్యాయవాది పౌలోమీ పావని శుక్లా కూడా ఈ లిస్టులో చేరారు. ప్రముఖ నేపథ్య గాయని మాళవిక మనోజ్ కూడా ఈ ఘనతను సాధించింది.
For More News..