మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..

మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్ మండలం మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా,అశ్రద్ద వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ,విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. 

అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయం లో నిర్లక్ష్యం వహించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండు సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను కాలేజీ నుంచి డిటైన్ చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. గత కొన్ని రోజులుగా అన్నంలో  పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు కాలేజీ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

 ఆందోళనలు ఉదృతం కావడంతో కాలేజీ స్టాఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది.  

విద్యార్థులకు మైనంపల్లి మద్దతు

 మల్లారెడ్డి కాలేజీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సపోర్ట్ చేశారు. కళాశాల వద్దకు వచ్చి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.